మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?

మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ గెలుచుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత ప్రతినిధి నికితా పోర్వాల్ టాప్ 20లో చోటు దక్కించుకోలేకపోయారు.

మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?
Miss World 2026 Winner Jhoerie Mola Dominguez

Updated on: Sep 05, 2026 | 10:46 PM

మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేతగా నిలిచిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా జోహెరీకి కిరీటధారణ జరిగింది.

‘బ్యూటీ విత్ ఎ పర్పస్’తో ఆకట్టుకున్న జోహెరీ

తుది రౌండ్‌లో జోహెరీ తన సామాజిక సేవా కార్యక్రమం గురించి వివరించి న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ఆంగ్ల విద్యను అందించడమే తన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆంగ్ల భాష పిల్లలకు భవిష్యత్తులో అనేక అవకాశాలకు తలుపులు తెరుస్తుందని ఆమె చెప్పారు. విద్య ద్వారా పిల్లలు తమ భావాలను వ్యక్తపరచుకోవడంతో పాటు, తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పొందుతారని వివరించారు.

విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా..

మిస్ వరల్డ్ సంస్థ జోహెరీని అంకితభావం గల విద్యావేత్త, సామాజిక కార్యకర్త, కమ్యూనికేటర్‌గా అభివర్ణించింది. యూనివర్సిడాడ్ ఇబెరోఅమెరికానా నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందిన ఆమె ‘వాయిసెస్ ఆఫ్ టుమారో’ సంస్థను స్థాపించారు. దీని ద్వారా వెనుకబడిన వర్గాల పిల్లలు, యువతకు ఆంగ్ల విద్యను అందిస్తున్నారు. ఆంగ్లంలో సాహిత్యం, సామాజిక శాస్త్రాలను బోధిస్తూ విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు.

టాప్ 20లో చోటు దక్కించుకోని నికితా పోర్వాల్

మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్ టాప్ 20లో చోటు దక్కించుకోలేకపోయారు. 2024లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచిన నికితా.. టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటన, నాటకరంగంలోకి ప్రవేశించారు. 60కి పైగా నాటకాల్లో నటించడంతో పాటు ‘కృష్ణ లీల’ పేరుతో 250 పేజీల నాటకాన్ని రచించారు.

73వ పోటీ.. 75వ వార్షికోత్సవం ఎందుకు?

మిస్ వరల్డ్ పోటీ 1951లో ప్రారంభమైంది. కోవిడ్-19 కారణంగా 2020లో పోటీ రద్దు కావడంతో పోటీ ఎడిషన్ సంఖ్య, వార్షికోత్సవ సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఏర్పడింది. అందుకే 2026లో 73వ మిస్ వరల్డ్ పోటీ జరిగినప్పటికీ, సంస్థ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. వచ్చే ఏడాది మిస్ వరల్డ్ పోటీకి టాంజానియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున కజియా లిజ్ మెజో బరిలోకి దిగనున్నారు. 19 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన ఆమె ఆగస్టు 25న మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us