
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను గనక ఇరాన్ ఆర్మీ హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. ఆ దేశంపై చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో ఊహించని రీతిలో బాంబుల వర్షం జరపాలంటూ తాను ముందే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉంచానని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమను టార్గెట్ చేస్తున్న ఇరాన్ కుట్రలపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ నన్ను చంపాలని చాలా కాలంగా చూస్తుంది. వారి హిట్ లిస్ట్లో నేనే నంబర్ వన్ టార్గెట్ని. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. అయితే నాకు ఏదైనా జరిగితే మాత్రం.. ఇరాన్ ఊహించని రీతిలో, ఆ దేశ చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో బాంబులతో దాడి చేసి నాశనం చేయాలని నేను ఇప్పటికే ఆర్మీకి స్పష్టమైన సూచనలు ఇచ్చాను’’ అని తెలిపారు.
అదే సమయం, తనపై దాడికి సంబంధించి ఇజ్రాయెల్ కొత్త ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందించిందన్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. ‘‘ఇజ్రాయెల్ కొత్తగా ఏమీ తీసుకురాలేదు. ఇరాన్ నన్ను టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా ఇదే జరుగుతుంది. జీవితం ఇలాగే ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ ముగిస్తూ.. తనదైన శైలిలో నవ్వుతూ.. ‘‘ఒకవేళ నాకు ఏమైనా జరిగితే.. మీరు నన్ను బాగా మిస్ అవుతారని ఆశిస్తున్నాను’’ అంటూ చమత్కరించారు.
అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. 2020 నుండి ఇరాన్ దేశం ట్రంప్పై పగతో రగిలిపోతుంది. అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్.. ఇరాన్ టాప్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీని బాగ్దాద్ సమీపంలో అమెరికా డ్రోన్ దాడి ద్వారా హతమార్చడానికి ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుండి ట్రంప్ను అంతమొందించి రివెంజ్ తీర్చుకుంటామని ఇరాన్ బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ లింకులు ఉన్న పలు హత్యాయత్న కుట్రలను అమెరికా భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. కాగా జూలై 2024లో బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్పై ఒకసారి ప్రాణాంతక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్ళింది.
ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, కానీ ఆ దేశం మళ్లీ చర్చల కోసం అమెరికాను కోరిందని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేస్తూ.. ‘‘చర్చలు కొనసాగించాలని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మమ్మల్ని కోరింది. అందుకు మేము అంగీకరించాం. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ గడువు పూర్తిగా ముగిసిపోయిందనే విషయాన్ని అమెరికా వారికి చాలా స్పష్టమైన పదాలలో తేల్చి చెప్పింది’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
కాగా యాంకారాలో జరిగిన నాటో సదస్సు తర్వాత మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడాన్ని అమెరికా ఎంతమాత్రం సహించదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్తో భవిష్యత్తులో యుద్ధం లాంటి పరిస్థితి వస్తే.. అది ఎక్కువ కాలం కొనసాగే సుదీర్ఘ యుద్ధం కాదని, కేవలం కొద్ది రోజుల్లోనే ముగిసిపోయే సంక్షిప్త పోరాటమే అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.