ఎన్నికల వేళ నేతలకు ఓటరే దేవుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. డబ్బు, కానుకలు ఎరవేస్తుంటారు. అది ఏ దేశమైనా కావొచ్చు. నేతలందరి రూటు ఒకటే. ఎలాగైనా ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఇదే వారి లక్ష్యం. ఇప్పుడు బ్రిటన్లో కూడా ఇదే జరుగుతోంది.
డిసెంబర్ 12న ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్..భారతీయులను ఆకర్షించే పనిలో పడ్డారు. ప్రియురాలు క్యారీ సైమండ్స్తో కలిసి హిందూ దేవాలయాలను చుట్టేస్తున్నారు. భగవంతునితో పాటు భక్తులనూ వలలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇది కూడా ఏదో ఆషామాషీగా కాదు. భారతీయత ఉట్టిపడేలా చీర కట్టులో ఆలయానికి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు క్యారీ సైమండ్స్. లండన్లోని నీస్డెన్ హిందూ ఆలయంలో ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి..అక్కడ ఎన్నారైలతో మాట్లాడారు. ఇండియా డెవలప్మెంట్లో భాగస్వామినవుతానని..ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు.