తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం

Updated on: Jun 15, 2026 | 9:10 PM

విదేశీ గూఢచారి సంస్థలు తాబేళ్లు, చేపలకు సెన్సార్లు అమర్చి చైనా సముద్ర జలాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నాయంటూ బీజింగ్ సంచలన ఆరోపణలు చేసింది. సముద్ర ఉష్ణోగ్రత, ఉప్పుదనం, ప్రవాహాల వంటి డేటాను ఉపగ్రహాల ద్వారా విదేశాలకు పంపుతున్నారని చైనా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఆధారాలను మాత్రం ఇప్పటివరకు బయటపెట్టలేదు.

శత్రుదేశాలు తమ సముద్ర తీరంలో గూఢచారి తాబేళ్లను వదిలాయంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది చైనా! ప్రపంచ దేశాల మధ్య గూఢచర్యం కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు గూఢచర్యానికి ఉపయోగిస్తున్న పద్ధతులు ఆశ్చర్యపరుస్తున్నాయి. విదేశీ గూఢచారి సంస్థలు తమ దేశ సముద్ర జలాల్లో సమాచారాన్ని సేకరించేందుకు “గూఢచారి తాబేళ్లు” “గూఢచారి చేపలను ఉపయోగిస్తున్నాయని చైనా ఆరోపించింది. తమ దేశ సముద్రతీరంలో “అదృశ్య రహస్య యుద్ధం” జరుగుతోందని చైనా ప్రభుత్వం సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. తాబేళ్లు, చేపలకి ప్రత్యేక సెన్సార్లను అమర్చుతున్నారని, సెన్సార్లు సముద్రంలోని నీటి ఉష్ణోగ్రత, ఉప్పుదనం, సముద్ర ప్రవాహాల సమాచారాన్ని సేకరిస్తాయని చెప్పుకొచ్చింది. ఆ డేటాను ఉపగ్రహాల ద్వారా విదేశాలకు పంపుతున్నట్లు ఆరోపించింది. సముద్రాల్లో సేకరించే ఈ సమాచారం సాధారణ డేటా కాదని నిపుణులు చెబుతున్నారు . ఈ సమాచారంతో సముద్రపు అడుగుభాగానికి సంబంధించిన ఖచ్చితమైన మ్యాప్‌లను రూపొందించవచ్చు. ఇవి భవిష్యత్తులో నౌకాదళ కార్యకలాపాలు, జలాంతర్గాముల కదలికలు, వ్యూహాత్మక రక్షణ ప్రణాళికలకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే చైనా దీనిని జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించిందనీ అయితే చైనా చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలను మాత్రం ఇప్పటివరకు బయటపెట్టలేదనీ అంటున్నారు. ఏ ప్రాంతంలో ఈ గూఢచారి జలచరాలు కనిపించాయో, వాటిని ఏ దేశం పంపిందో కూడా చెప్పలేదు. దాంతో ఆ ప్రకటనపై అంతర్జాతీయ వర్గాల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తమ పరిశోధనల్లో భాగంగా జంతువులను సెన్సార్లతో ట్రాక్ చేయడం శాస్త్రవేత్తలు చాలాకాలంగా చేస్తున్న పని. సముద్ర జీవుల వలస మార్గాలను, వాతావరణ మార్పుల ప్రభావం తెలుసుకోవడానికి ఇలాంటి పరికరాలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నారనే చైనా ఆరోపణ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ప్రపంచ రాజకీయాల్లో టెక్నాలజీ ఎంత వేగంగా మారుతోందో, గూఢచర్య పద్ధతులు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఉపగ్రహాలు, డ్రోన్లు మాత్రమే గూఢచర్యానికి ఉపయోగపడేవి. ఇప్పుడు తాబేళ్లు, చేపలు కూడా అంతర్జాతీయ నిఘా వ్యవస్థల్లో భాగమవుతున్నాయా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చైనా ఆరోపణలు నిజమా? లేక ఇది జాతీయ భద్రత అంశంపై మరింత అప్రమత్తత కల్పించేందుకు చేసిన హెచ్చరిక మాత్రమేనా? అనే విషయం రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. సముద్రాల అడుగున జరుగుతున్న ఈ “అదృశ్య యుద్ధం” ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది.. దేశవ్యాప్తంగా రగిలిన వివాదం!

రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..

Loading...
Unable to load recommendations.
Follow Us