భూగర్భంలో ఇరాన్ ‘మిస్సైల్ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్ తన భూగర్భ 'మిస్సైల్ సిటీ'ని వెల్లడించింది. వందల అడుగుల లోతులో ఉన్న ఈ క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు అమెరికా నౌకాదళానికి పెను సవాలు. ప్రత్యేకించి కామికాజ్ డ్రోన్ బోట్లు భారీ యుద్ధ నౌకలను ధ్వంసం చేయగలవు. ఇది మానసిక యుద్ధంలో భాగం, ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పుగా మారింది.
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇరాన్ సైన్యం తన ‘మిస్సైల్ సిటీ’కి సంబంధించిన వీడియోను బయటపెట్టింది. భూమికి వందల అడుగుల లోతులో ఈ ఆయుధ సంపత్తిని ఇరాన్ భద్రపరిచింది. పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడి కొండల కింద, భూగర్భంలో కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహస్య బంకర్లు ఇప్పుడు అమెరికా నౌకాదళానికి పెను సవాలుగా మారాయి. ఇరాన్ ప్రభుత్వ టీవీ విడుదల చేసిన వీడియోలో, పొడవాటి భూగర్భ సొరంగాల్లో వందలాది క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. వీటిలో అత్యంత ప్రమాదకర ఆయుధం ‘సూసైడ్ కామికాజ్ డ్రోన్ బోట్లు’. ఇవి చిన్న సైజులో ఉండి, నీటి కింద అత్యంత వేగంగా ప్రయాణించగలవు. వీటిలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను నింపుతారు. ఎప్పుడైతే ఇవి శత్రువుల యుద్ధ నౌకను తాకుతాయో, అప్పుడు స్వయంగా పేలిపోయి అవతలి నౌకను జలసమాధి చేస్తాయి. ఇటీవల పర్షియన్ గల్ఫ్లో జరిగిన రెండు అమెరికా ఆయిల్ ట్యాంకర్ల దాడుల్లో ఈ డ్రోన్లనే ఇరాన్ వాడింది. ఇరాన్ మిస్సైల్ సిటీలో కామికాజ్ తో పాటు యాంటీ-షిప్ మిస్సైళ్లు, సముద్ర మందుపాతరలు ఉన్నాయి. శత్రు దేశాల యుద్ధ నౌకలు జలసంధిలోకి ప్రవేశించగానే, ఈ భూగర్భ కేంద్రాల నుంచి ఏకకాలంలో వందలాది క్షిపణులను ప్రయోగించే ‘స్వార్మ్ అటాక్’ వ్యూహాన్ని ఇరాన్ అమలు చేసే అవకాశం ఉంది. ఇరాన్ ఈ వీడియోలను ఇప్పుడు విడుదల చేసి అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల తర్వాత కూడా తమ ఆయుధ సంపత్తి ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఇది శత్రువుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ‘సైకలాజికల్ వార్ఫేర్’లో భాగమే. అమెరికా తన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఇలాంటి భూగర్భ నగరాలను నాశనం చేయడం సాధ్యం కాదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలకు ఈ సూసైడ్ డ్రోన్లు, భూగర్భ క్షిపణుల నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. ఒక చిన్న డ్రోన్ బోటు కూడా కొన్ని వేల కోట్ల విలువైన యుద్ధ నౌకను తీవ్రంగా దెబ్బతీయగల సామర్థ్యం కలిగి ఉండటమే ఆందోళన కలిగించే అంశం. హర్మూజ్ జలసంధిని కాపాడుకోవడానికి ఈ భూగర్భ క్షిపణులనే ఇరాన్ తన చివరి అస్త్రంగా వాడుకోనుంది. ఈ యుద్ధం చివరకు ఎటు దారితీస్తుందో కానీ, దీనివల్ల ప్రపంచ ఇంధన భద్రత మాత్రం గాలిలో దీపంలా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్ సెగలు’.. ఎందుకంటే..
యుద్ధరంగంలోకి ఇరాన్ ‘డ్యాన్సింగ్ మిసైల్’..!
భారత్లో భూగర్భంలో చమురు నిల్వలు..
నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా
టాలీవుడ్లో ఖాళీగా ఉన్న నెంబర్ వన్ చైర్.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా
