AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు తెల్లగా పుట్టాడని భర్త వేధింపులు.. అద్దంపై సూసైడ్ నోట్ వీడియో

కొడుకు తెల్లగా పుట్టాడని భర్త వేధింపులు.. అద్దంపై సూసైడ్ నోట్ వీడియో

Samatha J

|

Updated on: May 01, 2025 | 4:07 PM

కన్న కొడుకు శరీర ఛాయపై అనుమానం, అదనపు కట్నం కోసం వేధింపులు ఓ వివాహిత ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ దారుణ సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమ్మా నాన్నా.! నా కొడుకును మీరే పెంచండి.! మా అత్తమ్మ వాళ్లకు మాత్రం అప్పగించకండి అని అద్దంపై రాసి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న తీరు పలువురిని కలిచివేస్తోంది. పండంటి బిడ్డ పుట్టిందన్న సంబరం లేకుండా వరకట్న వేధింపులకు గురి చేస్తున్న మెట్టినింటి వారి బాధలు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్న లక్ష్మీకి, జిల్లాలోని వెల్గటూరు మండలం రామునూరుకు చెందిన తిరుపతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ జీవిస్తున్న క్రమంలో ప్రసన్న లక్ష్మీకి బాబు పుట్టాడు. అప్పటి నుండి ఉద్యోగం మానేసిన ఆమె ఇంటికే పరిమితం అయింది. అయితే ప్రసన్న లక్ష్మీ, భర్త తిరుపతిలు ఇద్దరు కూడా చామన ఛాయ రంగులో ఉండగా, వీరికి కలిగిన సంతానం మాత్రం తెల్లగా ఉండడం ఏంటన్న కారణంతో తరుచూ మెట్టినింటి వారు వేధింపులకు గురి చేశారు. అయితే ప్రసన్న లక్ష్మీ, తిరుపతిలు మొదట ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ బాబు పుట్టిన తరువాత అనుమానం ముసుగులో కట్నం కోసం వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టారు.మెట్టినింటి వారి వేధింపులు భరిస్తూనే ప్రసన్న లక్ష్మీ కొంతకాలం కాపురాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఐదు రోజుల క్రితం బెంగుళూరు నుండి మెట్టినింటికి చేరుకున్న తరువాత కూడా కట్నం విషయంలో అత్తింటి వారు మానసికంగా వేధించారు. ప్రసన్న లక్ష్మీ తండ్రి బుధవారం రామునూరుకు వెల్లి కూతురును వెంటబెట్టుకుని జగిత్యాలకు చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తరువాత ప్రసన్న లక్ష్మీ ఇంట్లోని అద్దంపై ‘‘అమ్మా, నాన్న నాకు బ్రతకాలని లేదు… నా కొడుకు జాగ్రత్త, ప్లీజ్ వాళ్లకు మాత్రం ఇవ్వకండి’’ అని అద్దంపై రాసి ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.