బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్‌!

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్నినెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తే..కొన్ని షాక్‌కి గురిచేస్తాయి. తాజాగా బస్సులో జరిగిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ బస్సులోకి ఎలా వచ్చిందో కానీ ఓ ఎద్దు ప్రత్యక్షమైంది. దాంతో ఒక్కసారిగా ప్రయాణికులు బస్సులోంచి కిందికి దూకేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.బస్టాండ్‌లో ఓ బస్సు ఆగింది. బస్సులోని ప్రయాణికులంతా మొబైల్స్‌ చూసుకోవడంలో మునిగిపోయారు.

ఇంతలో ఆక్కడికి ఓ ఎద్దు వచ్చింది. బస్సు ఫుట్‌బోర్డ్‌ దగ్గర నిలబడి లోపలికి చూసింది. సాధారణంగా బస్సులోని వారు ఏదైనా ఆహారం పెడతారేమోనని ఇలా రోడ్లపైన తిరిగే ఆవులు, ఎద్దులు బస్సుల దగ్గరకు వచ్చి నిల్చుంటాయి. ఈ బస్సులోని ప్రయాణికులు మొబైల్స్‌ చూడ్డంలో లీనమైపోవడంతో ఎద్దును గమనించలేదు. ఎంతకీ ఎవరూ ఏమీ పెట్టకపోవడంతో ఆ ఎద్దు మనమే లోపలికి వెళ్లి వెతుక్కుందామనుకున్నట్టుంది. వెంటనే బస్సులోపలికి ఎక్కింది. బస్సులో ఒక్కసారిగా ఎద్దును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎద్దు ఎక్కడ తమ మీదకు దూకేస్తుందో అనే భయంతో అంతా అటూ, ఇటూ పరుగులు తీశారు. డ్రైవర్ తన సీటు డోర్‌ ఓపెన్‌ చేసుకొని దూకేశాడు. అతనితోపాటు కొందరు ప్రయాణికులు కూడా అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకేశారు. బస్సులో ఎద్దు అటూ ఇటూ తిరగడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి.