ఎలుకా.. మజాకా..!
బెంగళూరులోని ఓ జ్యువెలరీ షాపులో సుమారు పది లక్షల విలువైన ఆభరణాలు మాయం కావడంతో యజమాని కంగారు పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా షాకింగ్ నిజం బయటపడింది. ఓ ఎలుక బంగారు ఆభరణాలను ఒక్కొక్కటిగా నోట కరుచుకుని తీసుకెళ్లడం రికార్డయింది. ఆ ఎలుక దాచిన చోటనుంచి వజ్రాల ఉంగరాలు, బంగారు గొలుసులు తిరిగి లభించాయి. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బంగారం, వజ్రాభరణాలు అంటే ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి. మనుషులకే కాకుండా ఓ ఎలుకకు కూడా వాటిపై మోజు పుట్టింది. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని తూమకూరులో విశ్వాస్ జ్యువెలర్స్ అనే నగల షాపులో అరుదైన దొంగతనం జరిగింది. సుమారు పది లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. దొంగలు పడ్డారని భావించిన యజమానులు, షాపును బలవంతంగా తెరిచిన ఆనవాళ్లు లేకపోవడంతో అయోమయానికి గురయ్యారు.పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు, ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూడగా షాకింగ్ నిజం బయటపడింది. అక్కడ దొంగతనం చేసింది మనుషులు కాదు.. ఓ ఎలుక. అది ఒక్కో ఆభరణాన్ని నోట కరుచుకుని లాక్కెళ్లడం స్పష్టంగా రికార్డు అయ్యింది. దీంతో షాపు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఎలుక వెళ్లిన దారిని అనుసరించి, సమీపంలోని ఓ కలుగులోకి వెళ్లినట్లు గుర్తించారు. కలుగును తవ్వగా అందులో ఎలుక దాచిపెట్టిన పది వజ్రాల ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు సురక్షితంగా బయటపడ్డాయి. దీంతో ఆభరణాలు దక్కినందుకు యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విచిత్ర దొంగతనం వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :