అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే

Updated on: Apr 01, 2026 | 7:29 PM

ఆదిలాబాద్ జిల్లా ముత్నూరు తండాకు చెందిన రైతు రాంప్రకాష్‌ పండించిన 50 క్వింటాళ్ల శనగ పంటను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చేశారు. మూడు లక్షల రూపాయల విలువైన పంట కళ్లముందే కాలిపోవడంతో ఆ రైతు గుండె పగిలేలా రోదించాడు. అకాల వర్షాలతో నష్టపోయిన వేళ ఈ దారుణం జరగడంతో బాధితుడు ప్రభుత్వం ఆదుకోవాలని, దోషులను శిక్షించాలని వేడుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే కాలి బూడిదైపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దుశ్చర్యకు ఒక నిరుపేద రైతు గుండెపగిలేలా రోదించాడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ముత్నూరు తండాలో అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ముత్నూరు తండాకు చెందిన రైతు రాంప్రకాష్ తన శనగ పంటను కోత కోయించి, సుమారు 50 క్వింటాళ్ల పంటను చేనులోనే కుప్పగా వేశాడు. పంటకు కాపలాగా ఆయన అక్కడే నిద్రపోయాడు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పంట కుప్పకు నిప్పు పెట్టారు. మంటల వేడికి ఉలిక్కిపడి లేచిన రాంప్రకాష్‌ కేకలు వేయడంతో తోటి రైతులు పరుగున వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో పంట మొత్తం కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల విలువైన పంట అగ్నికి ఆహుతైపోయింది. ఒకవైపు అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటుంటే, మరోవైపు పగతో దుండగులు తన పంటను తగలబెట్టడంతో రాంప్రకాష్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పాత కక్షల వల్ల ఎవరైనా ఈ పని చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు

హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

Follow Us