10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్‌లో 720కి 107 మార్కులే !! బయటపడిన భారీ స్కామ్

Updated on: May 19, 2026 | 5:56 PM

నీట్ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. లీకైన ప్రశ్నపత్రాన్ని కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడి కుమారుడు రిషి బివాల్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో 150 మంది విద్యార్థులపై సీబీఐ నిఘా పెట్టింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ 2026 పేపర్ లీకేజీ కేసు దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు బయటకొస్తున్నాయి. కేసును విచారిస్తున్న సీబీఐ రాజస్థాన్‌లోని సికార్ జిల్లాపై దృష్టి పెట్టింది. తాజాగా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దినేశ్ బివాల్, అతని సోదరుడు మంగీలాల్ బివాల్, మంగీలాల్ పెద్ద కుమారుడు వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నీట్ అసలు ప్రశ్నపత్రాన్ని పోలిన ఒక ‘గెస్ పేపర్‌’ను నిందితులు సంపాదించి, కోచింగ్ సెంటర్లకు సరఫరా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఈ పేపర్ పలువురు అభ్యర్థులకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దినేశ్ బివాల్ కుమారుడు రిషి బివాల్ కోసం సీబీఐ గాలిస్తోంది. తన కొడుకు రిషిని డాక్టర్‌ను చేయాలనే ఉద్దేశంతో దినేశ్ సుమారు రూ. 10 లక్షలు చెల్లించి లీకైన పేపర్‌ను సికార్‌లో కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అయితే, పరీక్షకు ముందే పేపర్ చేతికి అందినప్పటికీ రిషి నీట్‌లో 720 మార్కులకు గాను కేవలం 107 మార్కులు మాత్రమే సాధించాడు. ప్రస్తుతం రిషి కూడా పరారీలోనే ఉన్నాడు. దర్యాప్తులో రిషి అకడమిక్ రికార్డును పరిశీలించగా అతడు చదువులో చాలా వెనుకబడినట్లు తేలింది. 10వ తరగతిలో కేవలం 44 శాతం మార్కులు సాధించిన రిషి.. 12వ తరగతిలో గ్రేస్ మార్కులతో సెకండ్ డివిజన్‌లో 50% మార్కులతో పాసయ్యాడు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ థియరీ పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అయినప్పటికీ, అతడిని మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు సిద్ధం చేయడం కోసం కుటుంబం ఈ అడ్డదారిని ఎంచుకుంది. ఈ లీకేజీ నెట్‌వర్క్ కార్యకలాపాలకు సికార్‌లోని ఒక ఫ్లాట్‌ను సమన్వయ కేంద్రంగా ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నెట్‌వర్క్‌లోని కొంతమంది సభ్యులు కొరియర్లుగా వ్యవహరించి లీకైన పేపర్లను అభ్యర్థులకు నేరుగా చేరవేసినట్లు తేలింది. అరెస్ట్ అయిన దినేశ్, అతడి కుటుంబ సభ్యులు కూడా ఈ కొరియర్ పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సుమారు 150 మంది విద్యార్థులను గుర్తించి, వారిపై సీబీఐ నిఘా పెట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని! వైరల్ అయిన ఉద్యోగిని వీడియో

ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

లెక్కల టీచర్‌ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

ఉద్యోగమే మీ గుర్తింపు కాదు.. మహిళ వీడియో వైరల్

Bermuda Triangle: 3 కోట్ల ఏళ్ల బెర్ముడా దీవి మిస్టరీని.. ఛేదించిన శాస్త్రవేత్తలు

Follow Us