కేదార్నాథ్లో పాత కాలిబాట మార్గం ఓపెన్.. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ.. !
కేదార్నాథ్ కు వెళ్లే భక్తులకు, ఈ సీజన్ నుంచి ఉపశమనం కలగనుంది. పాత కాలిబాట పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. 13 ఏళ్ల తర్వాత ఆ మార్గం తిరిగి అందుబాటులోకి రావడం పై భక్తులు సంతోషం వ్యక్తం చేసారు. 2013 జూన్లో కేదార్నాథ్ వరదల్లో ఆ కాలిబాట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో యాత్రికులు ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం గుప్తకాశీ పబ్లిక్ వర్క్స్ శాఖ ఆ మార్గాన్ని దశలవారీగా పునర్నిర్మించింది. మొదట కేదార్నాథ్ నుంచి గరుడచట్టి వరకు ఉన్న 3.3 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత, తీవ్రంగా దెబ్బతిన్న గరుడచట్టి నుంచి రాంబారా 5.3 కిలోమీటర్ల సెక్షన్ను కూడా పూర్తి చేశారు.
బాబా కేదార్నాథ్ను దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి ప్రయాణం సులభంగా, సురక్షితంగా ఉండేలా పాత కేదార్నాథ్ మార్గంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మార్గం వెంబడి తాగునీరు, వర్షం నుంచి రక్షణ కల్పించే షెడ్లు, రైలింగ్లు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భక్తులు ప్రతికూల వాతావరణంలోనూ సౌకర్యవంతంగా ఉండేందుకు వీలవుతుంది. కేదార్ నాథ్ ఆలయాన్ని చేరుకునేందుకు, భక్తులకు ఈ సీజన్ నుంచి రెండు మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి పునర్నిర్మించిన గౌరీకుండ్-రాంబారా-గరుడచట్టి-కేదార్నాథ్ మార్గం కాగా, రెండోది ప్రస్తుతం అందుబాటులో ఉన్న గౌరీకుండ్-రాంబారా-లించౌలి మార్గం. అయితే, రాంబారా నుంచి కేదార్నాథ్ దూరం గతంలో 7 కిలోమీటర్లు ఉండేదని, కొన్ని మార్పుల కారణంగా అది ఇప్పుడు 8.6 కిలోమీటర్లకు పెరిగింది.
మరిన్ని వీడియోల కోసం :
