ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
అడవికి రారాజు అడవిదున్నలు కవ్వాల్ అభయారణ్యంలో తిరిగి సందడి చేస్తున్నాయి. వ్యాధుల కారణంగా అంతరించే స్థితికి చేరిన ఈ భారీ శాకాహార జంతువులు, అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లతో పునరుజ్జీవం పొందుతున్నాయి. అడవి ఆహార చక్రంలో కీలక పాత్ర పోషిస్తూ, ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయి. వీటి పెరుగుదల పర్యావరణ ప్రేమికులకు ఆశలు నింపుతోంది.
మాంసాహార జంతువుల్లో అడవికి రారాజు సింహం అయితే, శాకాహార జంతువుల్లో ఆ కిరీటం నిస్సందేహంగా అడవిదున్నదే. తన భారీ కాయంతో పులులు, సింహాలను సైతం గడగడలాడించే ఈ ‘ఇండియన్ బైసన్’, తాజాగా కవ్వాల్ అభయారణ్యంలో మళ్ళీ సందడి చేస్తోంది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండి, వ్యాధుల కారణంగా అంతరించిపోయే దశకు చేరిన ఈ వన్యప్రాణులు, ఇప్పుడు మళ్ళీ జనం కంటపడుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ రోడ్డుపై ఒక భారీ అడవిదున్న ప్రత్యక్షమైంది. గంభీరంగా అడుగులు వేస్తూ వెళ్తున్న ఈ ‘బాహుబలి’ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతూ తమ సెల్ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఇవి జన్నారం, తాళ్లపేట, పెంబి ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వీటి సంతతిని పెంచేందుకు అటవీ శాఖ కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో వందలాది ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ అడవిదున్నలు ముదురు గడ్డి, వెదురు చిగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పైన ఉన్న ముదురు గడ్డిని తినడం వల్ల, కింద కొత్తగా మొలిచే లేత గడ్డి జింకలు, దుప్పులకు మేతగా మారుతుంది. తద్వారా అడవిలోని ఆహార చక్రం సమతుల్యంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కవ్వాల్ అడవుల్లో అడవిదున్నల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అడవికి రారాజుగా వెలుగొందుతున్న ఈ భారీ జీవుల రక్షణ ఇప్పుడు పర్యావరణ ప్రేమికుల్లో ఆశలు చిగురింపజేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
