560 రోజులుగా 400 అడుగుల ఎత్తయిన టవర్‌ పైనే.. కారణం ఇదే!

Updated on: Apr 26, 2026 | 5:59 PM

సాధారణంగా ఒక డిమాండ్ కోసం నిరసన తెలపాలంటే ఒకటి రెండు రోజులు లేదా కొన్ని వారాల పాటు ధర్నా చేయడం సహజం. కానీ, ఒక వ్యక్తి తన నమ్మకం కోసం, తన మనోభావాలను కాపాడుకోవడం కోసం ఏకంగా 560 రోజుల పాటు 400 అడుగుల ఎత్తులో ఉండి నిరసన తెలపడం సాధారణం విషయం కాదు. పంజాబ్‌కు చెందిన పాడి రైతు గుర్జీత్ సింగ్ ఖల్సా ప్రదర్శించిన ఈ అసాధారణ ధైర్యం, చిత్తశుద్ధి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

2024 అక్టోబర్ 12న సమనాలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను గుర్జీత్ సింగ్ ఖల్సా తన నిరసన వేదికగా మార్చుకున్నారు. ఆయన పోరాటం కేవలం ఒక వ్యక్తి కోసమో, ఒక ప్రాంతం కోసమో కాదు, లక్షలాది సిక్కుల మనోభావాలను కాపాడేందుకు నిరంతరపోరాటం సాగించారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్ సాహిబ్’ను అపవిత్రం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అటువంటి అగౌరవకరమైన చర్యలను అరికట్టేలా కఠిన చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తన డిమాండ్ నెరవేరే వరకు టవర్ దిగి కిందకు వచ్చే ప్రసక్తే లేదని ఆయన శపథం చేశారు. గుర్జీత్‌ సింగ్‌ జీవితంలో ఏకంగా 560 రోజులు సెల్‌టవర్‌పైనే గడిచిపోయాయి. ఏకంగా 400 అడుగుల ఎత్తులో ఎండ,వాన, చలిని లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేశారు. టవర్ పై భాగంలో ఒక చిన్న టార్పాలిన్ షెల్టర్‌ను ఏర్పాటు చేసుకుని అందులోనే ఆయన నివసించారు. గుర్జీత్‌ సింగ్‌ నిరసనకు మద్దతుగా నిలిచిన కొందరు మద్దతుదారులు, కుటుంబ సభ్యులు రోజూ ఆహారాన్ని తాడు సాయంతో పైకి పంపేవారు. మలమూత్ర విసర్జన వంటి అవసరాల కోసం పాలిథీన్ కవర్లను ఉపయోగించారే తప్ప ఆయన తన సంకల్పం వీడలేదు.. టవర్‌ దిగి కిందకు రాలేదు. వాతావరణం మారినా, ఆరోగ్య సమస్యలు ఎదురైనా, తన లక్ష్యం వీడలేదు. 18 నెలల 12 రోజుల పాటు ఆయన కొనసాగించిన ఈ నిరసన నిజంగా అరుదైనదిగా చెప్పవచ్చు. 560 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు ప్రభుత్వం స్పందించింది. గురు గ్రంథ్ సాహిబ్ పట్ల అగౌరవంగా ప్రవర్తించే వారిని శిక్షించేందుకు ఉద్దేశించిన ‘ది జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ అనే కొత్త సవరణ చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. తన ప్రధాన డిమాండ్ నెరవేరడంతో, ఎట్టకేలకు గుర్జీత్ సింగ్ ఖల్సా తన నిరసనను విరమించారు. ఏప్రిల్‌ 24 శుక్రవారం నాడు టవర్ పై నుంచి క్షేమంగా కిందకు దిగారు. వెంటనే అధికారులు ఆయనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం :

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌

Published on: Apr 26, 2026 05:38 PM
Follow Us