భార్యను వీపుపై మోసుకుని కలెక్టరేట్‌కు.. 10 ఏళ్లుగా న్యాయం కోసం కుటుంబం పోరాటం

Updated on: Jun 21, 2026 | 5:05 PM

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో వికలాంగురాలైన భార్యను వీపుపై మోసుకుని కలెక్టరేట్‌కు వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితి అందరినీ కలచివేసింది. పదేళ్లుగా రేషన్, గృహ పథకాలు వంటి ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోవడానికి సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులెన్నో. అలాంటి ఒక హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జరిగింది. పదేళ్లుగా ప్రభుత్వ సబ్సిడీ రేషన్ కోసం పోరాడుతున్న పుష్పేంద్ర సింగ్ అనే వ్యక్తి.. వికలాంగురాలైన తన భార్య నీలూ రాజాను వీపుపై మోసుకుంటూ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా వినతుల విచారణ కార్యక్రమానికి వచ్చాడు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన ఆ దంపతులు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబం ఎంతటి దయనీయ స్థితికి చేరుకుందో కలెక్టరేట్ అధికారుల ముందు కన్నీళ్లతో వివరించారు. తీవ్ర శారీరక వైకల్యంతో పాటు ప్రస్తుతం భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో మూత్రపిండాల వ్యాధికి చికిత్స పొందుతోంది నీలూ రాజా. పంచాయతీ అధికారులు తమను ఎలా మోసం చేశారో తెలిపింది. అత్యంత పేద కుటుంబాలకు ఇచ్చే ‘అంత్యోదయ అన్న యోజన’ రేషన్ కార్డును.. పదేళ్ల క్రితం తమకు తెలియకుండానే సాధారణ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కార్డుగా మార్చేశారని ఆమె ఆరోపించింది. ఈ మార్పు చేసినప్పటి నుంచి వారికి ఎలాంటి రేషన్ కూపన్లు జారీ చేయకపోవడంతో, బతకడానికి అవసరమైన సబ్సిడీ బియ్యం, గోధుమలు అందకుండా పోయాయనీ వాపోయింది. దీనికి తోడు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఇళ్లకు సంబంధించిన నిధులు గానీ, మరుగుదొడ్ల నిర్మాణ సహాయం గానీ తమకు అందకుండా నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ.. గ్రామ సర్పంచ్, కార్యదర్శి తమ ఫిర్యాదులను పూర్తిగా విస్మరించారని ఆరోపించింది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తాము చేసుకోని అప్పీలు లేదని, ఎక్కడా తమకు న్యాయం జరగలేదని తెలిపింది. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, ఇది తన పిల్లల చదువుపై కూడా దెబ్బకొట్టిందని ఆమె వివరించింది. ఈ హృదయవిదారక ఉదంతంపై స్పందించిన పన్నా జిల్లా కలెక్టర్ ఉషా పర్మార్.. ఈ వ్యవహారాన్ని తక్షణమే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు వెంటనే రేషన్ పత్రాలను మంజూరు చేయడంతో పాటు, వారికి అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలను చేరవేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని.. చిన్న స్పార్క్‌ వచ్చినా ప్రమాదమే!

ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్

Follow Us