Andhra: ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా

Edited By: Ram Naramaneni

Updated on: Apr 15, 2025 | 9:08 AM

గర్ల్స్ హాస్టల్​లో పాము కలకలం సృష్టించింది. ఎవరూ లేకుండానే హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు రావడంతో బాలికలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి చూడగా లోపల ఓ నాగుపాము కనిపించింది. దీంతో విద్యార్థిణిలను పక్కకు పంపించి.. స్నేక్ క్యాచర్‌కు కాల్ చేశారు.

వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లదనాన్ని వెతుక్కుంటూ పాములు పుట్టల్లోంచి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్లు, స్కూళ్లు, వాహనాలు ఎక్కడంటే అక్కడ చేరి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్‌లో నాగుపాము హల్ చల్ చేసింది. స్కూల్‌కు చెందిన లేడిస్‌ హాస్టల్‌లో నాగుపాము సంచరించడంతో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు.

భయంతో విద్యార్ధినులు పరుగులు తీస్తుండటంతో ఏం జరిగిందని వార్డెన్‌ అడగ్గా.. వాష్‌రూమ్‌లో నాగుపామును చూసిన విషయం చెప్పారు. వెంటనే వార్డెన్‌ స్థానిక స్నేక్‌ క్యాచర్‌ మహేష్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న మహేష్‌ నాగుపామును పట్టుకునేందుకు రెండు గంటలు శ్రమించాల్సి వచ్చింది. తనను పట్టుకునే క్రమంలో నాగుపాము స్నేక్‌ క్యాచర్‌ను ముప్పుతిప్పలు పెటింది. మొత్తానికి ఎంతో చాకచక్యంగా మహేష్‌ నాగుపామును బంధించగలిగాడు. దానిని తీసుకొని వెళ్లి నల్లమల అడవిలో సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో విద్యార్ధినులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 15, 2025 08:49 AM