పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు టెక్నాలజీని వాడుతుంటే, దొంగలు అంతకు మించిన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు దుండగులు వేసిన 'బ్లాక్ స్ప్రే' ప్లాన్ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో చర్చనీయాంశమైంది.
చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన దొంగలు, పట్టుబడతామనే భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. సైరన్ కారణంగా బ్యాంకులో ఉన్న భారీ నగదు, బంగారం సురక్షితంగా మిగిలాయి.బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టిన విధానాన్ని చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్ ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్నాలజీని వాడి తప్పించుకోవాలని చూసినా, భద్రతా వ్యవస్థ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, బ్యాంకువారు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :