ప్రేమిస్తే చావేనా?ఓ తండ్రి పరువు కోసం..వీడియో
ప్రేమిస్తే చావేనా?.. కన్నకూతురు కన్నా, పరువే గొప్పా.. కులం, పరువు కోసం గుండెలపై పెట్టుకుని పెంచుకున్న పేగుబంధాన్ని కూడా తెంపేసుకుంటారా? చిత్తూరు, అనంతపురం పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కులాంతర ప్రేమలను తండ్రులు జీర్ణించుకోలేక కన్నపేగులపైనే కత్తులు దూశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో అలాంటి ఘటనే జరిగింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానన్నదనే కోపంతో ఓ తండ్రి పరువు కోసం ఏకంగా కూతురిని ఉరేసి చంపేసి, ఆపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆపై గుంతకల్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
రామంజినేయులుకు నలుగురు కుమార్తెలు. ఇంకా ఎవరికీ పెళ్లి కాలేదు. ఆఖరి అమ్మాయి భారతి బీటెక్ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం తాను ఓ అబ్బాయి ప్రేమించానని అతడినే వివాహం చేసుకుంటానని తండ్రికి చెప్పింది. ఐతే కూతురు ప్రేమించిన యువకుడిది వేరే కులం కావటంతో తండ్రి అంగీకరించలేదు. ప్రేమ పెళ్లికి నిరాకరించాడు. తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు తండ్రి. అయితే అందుకు భారతి అంగీకరించలేదు. దీంతో కూతురిపై కోపం పెంచుకున్న ఆ తండ్రి.. కూతురి ప్రేమ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందేమో, మిగతా కూతుళ్లకు పెళ్లి కాదేమోననే భయంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కూతురిని కసాపురం శివార్లలోని తిక్క స్వామి ఆలయం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే భారతికి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తన కూతుర్ని తాను హత్య చేశానంటూ ఆ తర్వాత గుంతకల్లు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.