తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతుగా కాంగ్రెస్, వామపక్షాలు
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన టైం వచ్చేసింది. మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ పక్షాన 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కోర్టు తీర్పుతో TVK ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటును మినహాయిస్తే.. ఆ సంఖ్య 119కి పడిపోతుంది.
విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి కీలకమైన బలపరీక్ష ప్రక్రియ అసెంబ్లీలో ప్రారంభమైంది. విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సీఎం విజయ్ సభలో అధికారికంగా ప్రవేశపెట్టగా.. ప్రస్తుతం దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతుగా పలు పార్టీలు బహిరంగంగా ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చలో భాగంగా కాంగ్రెస్, విముక్తి చిరుతలు కచ్చి(VCK), లెఫ్ట్ పార్టీలు విజయ్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాయి. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షించాయి.
ఇక గవర్నర్ వ్యవహారశైలిపై భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తీవ్ర విమర్శలు చేసింది. కావాలనే విజయ్ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారని, ప్రమాణస్వీకార ప్రక్రియను ఆలస్యం చేశారని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి గవర్నర్ కూడా సహకరించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు విముక్తి చిరుతలు కచ్చి పార్టీ కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ.. ఈ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆకాంక్షించింది. అసెంబ్లీలో జరుగుతున్న ఈ చర్చ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
