చిత్తూరు జిల్లా SR పురం మండలం లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మర్రిపల్లి స్మశానవాటికలో పెద్ద మనిషి బొమ్మను చేసి, పసుపు కుంకుమ, నిమ్మకాయలు, అగ్ని గుండం ఏర్పాటు చేసి చుట్టూ దీపాలు పెట్టి క్షుద్ర పూజలు చేశారు. గ్రామానికి సమీపంలోనే ఉన్న స్మశానవాటికలో క్షుద్ర పూజల ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్మశాన వాటిక దాటుకొని వంకలో ఉపాధి పని చేసేందుకు వెళుతున్న కూలీలు ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లు గుర్తించారు. విషయాన్ని గ్రామంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగాయంటున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇక్కడి స్మశాన వాటికలో ఇలా క్షుద్రపూజలు జరుగుతున్నాయని భయాందోళన చెందారు. స్మశానవాటిక మీదుగానే తమ గ్రామాలకు వెళ్లాలని, ఈ క్రమంలో ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతుండటం అటు వెళ్లాలంటే భయమేస్తుందని ఆరోపిస్తున్నారు.