Uttam Kumar Reddy: కాళేశ్వరం – ఎన్‌డీఎస్‌ఏ, పీసీ ఘోష్‌ నివేదికలపై అసెంబ్లీలో హీట్

Updated on: Aug 31, 2025 | 6:36 PM

కాళేశ్వరం నిర్మాణం డ్యామ్‌, బ్యారేజీ తేడా లేకుండా జరిగిందని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ కూలిపోవడానికి అదే కారణమని చెప్పారు. మూడు బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగమై, లక్ష కోట్లు ఖర్చు చేసినా ఒక లక్ష ఎకరానికి నీరు ఇవ్వలేదని విమర్శించారు.

కాళేశ్వరం నిర్మాణ లోపాలు ఉన్నాయని… డ్యామ్‌-బ్యారేజీ తేడా పట్టించుకోకుండా పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేయడం వల్లే అది కూలిపోయిందని స్పష్టం చేశారు.

రూ.87,449 కోట్ల భారీ ఖర్చుతో చేపట్టిన కాళేశ్వరం.. కానీ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం.. మూడు బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగం అని మంత్రి అన్నారు. రూ.38 వేల కోట్లలో పూర్తయ్యే ప్రాజెక్టును వదిలి, రూ.1.47 లక్షల కోట్ల కాళేశ్వరం చేపట్టారని ఆరోపించారు. ఇప్పటివరకు 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్‌ చేసినా, ఒక్క లక్ష ఎకరానికి కూడా నీరు అందలేదని విమర్శించారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో BRS ఉందని గుర్తుచేశారు. ఎన్‌డీఎస్‌ఏ బిల్లు వచ్చినప్పుడు కూడా అదే పార్టీ మద్దతిచ్చిందని మంత్రి మండిపడ్డారు.