విదేశం నుంచి వచ్చి ఓటేసిన విజయ్‌ ఫ్యాన్.. ఆ ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి

Updated on: May 06, 2026 | 5:51 PM

నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించింది. కేవలం ఒక్క ఓటు తేడాతో అభ్యర్థి గెలుపొందడం, విజయ్ డ్రైవర్‌ కుమారుడి విజయం ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌పై వీఎస్ బాబు సాధించిన గెలుపు రాజకీయ ప్రతీకారంగా నిలిచింది. లాటరీ కింగ్ మార్టిన్ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల నుంచి గెలిచి ఎన్నికల్లో తమదైన ముద్ర వేశారు.

నటుడు విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. టీవీకే తరఫున పోటీ చేసిన 10-12 మంది తప్ప మిగిలినవారు పెద్దగా పరిచయస్తులు కాదు. కానీ, వారంతా విజయ్‌ కటౌట్‌తో గెలిచారు. విజయ్‌ డ్రైవర్‌ కుమారుడు శబరినాథన్‌తో పాటు సామాన్యులు విజయాల్ని అందుకున్నారు. ఒక్క ఓటు తేడాతో టీవీకే అభ్యర్థి విజయం సాధించాడు. మస్కట్ నుంచి వచ్చిన విజయ్‌ అభిమాని ఓటేయడంతో అతను వేసిన ఆ ఒక్క ఓటు టీవీకే అభ్యర్థిని గెలిపించింది. శివగంగై జిల్లా తిరుపత్తూర్‌లో టీవీకే అభ్యర్థి శ్రీనివాసకు 83,376 ఓట్లు రాగా… డీఎంకే మంత్రి పెరియకరుప్పన్‌కు 83,375 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యంలో ఎంత మార్పును తీసుకురాగలదో ఈ ఫలితం నిరూపించింది. ఒక్క ఓటుతో తమ నేత ఓడిపోవడంతో డీఎంకే శ్రేణులు నిరాశపడ్డాయి. ఒమన్ నుంచి ఓటు వేయడానికి వచ్చిన విజయ్ అభిమాని మణికందన్ తనకు గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే పార్టీకి చెందిన వీఎస్ బాబు చేతిలో ఓడిపోవడం 15 ఏళ్ల నాటి అవమానానికి వీఎస్ బాబు తీర్చుకున్న ప్రతీకారంగా తమిళనాట చర్చ జరుగుతోంది. ఒకప్పుడు స్టాలిన్‌ గెలుపు కోసం పనిచేసారు వీ ఎస్‌ బాబు. 2011లో నార్త్‌ చెన్నై నుంచి స్టాలిన్ గెలిచారు కానీ 2,700 ఓట్ల స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. దీనికి బాబునే బాధ్యుడిని చేస్తూ ఆయన్ను పదవి నుంచి తప్పించింది డీఎంకే పార్టీ. సరైన సమయం కోసం వేచి చూసిన వీఎస్‌ బాబు, 2026 ఫిబ్రవరిలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరారు. అదే ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. అవమానంతో బయటకు వెళ్ళిన వ్యక్తి చేతిలోనే ఓటమి పాలుకావడం స్టాలిన్‌కు రాజకీయంగా పెద్ద దెబ్బ. ‘లాటరీ కింగ్’ మార్టిన్ కుటుంబసభ్యులలో ముగ్గురు, మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మార్టిన్ అల్లుడు , టీవీకే పార్టీ నేత ఆధవ్ అర్జున రెడ్డి విల్లివాక్కం నుంచి విజయం సాధించారు. మార్టిన్ భార్య లీమా రోజ్ లాల్‌గుడి నుంచి అన్నాడీఎంకే టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. పుదుచ్చేరి ఎన్నికల్లో మార్టిన్ కుమారుడు జోస్ NDA మిత్రపక్ష పార్టీ ‘లక్ష్య జననాయక కట్చి’ తరపున పోటీ చేసి గెలిచారు. మార్టిన్ గ్రూప్ టర్నోవర్‌ 15,000 కోట్ల రూపాయలు వరకు ఉంటుంది. ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు1,300 కోట్లు విరాళంగా ఇచ్చి, గతంలో ఈడీ విచారణను సైతం ఎదుర్కొన్నారు లాటరీ కింగ్‌ మార్టిన్‌‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Top 9 ET News: ఇది గాలివాటంగా వచ్చిన విజయమా ?? విజయే నమ్మడం లేదా??

Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??

Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్‌.. భిన్న వాతావరణం తో అకాల వర్షాలు

Divvala Madhuri: ‘ఇలా అయితే రాజకీయాలు కష్టం’ త్రిషను ఉద్దేశిస్తూ మాధురి షాకింగ్ పోస్ట్

Thalapathy Vijay: చదువు అంతంత మాత్రమే.. కానీ పట్టుదల కొండంత

Loading...
Unable to load recommendations.
Follow Us