బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!
రైలు ప్రయాణంలో RAC టికెట్లపై భారతీయ రైల్వే కీలక మార్పులు చేయనుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు, పూర్తి ఛార్జీలు వసూలు చేస్తూ బెర్త్ కేటాయించని RAC ప్రయాణికులకు రీఫండ్లు అందించే వ్యవస్థను రూపొందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ప్రస్తుతం బెర్త్ పంచుకుంటున్న విధానంపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని రైళ్లలో RAC బోర్డింగ్ నిషేధం వంటి మార్పులు కూడా చేసింది.
రైలు ప్రయాణంలో RAC కేటగిరీలో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వే త్వరలో తీపి కబురు చెప్పే అవకాశం కనిపిస్తోంది. RAC టికెట్లపై పూర్తి స్థాయి ఛార్జీలు వసూలు చేయడాన్ని పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రయాణ సమయంలో పూర్తి బెర్త్ కేటాయించకుండా, ఇతర ప్రయాణికులతో సీటు పంచుకోవాల్సి వచ్చినప్పుడు పూర్తి ఛార్జీ తీసుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది. చార్ట్ తయారయ్యాక కూడా బెర్త్ లభించని ప్రయాణికులకు, వారు చెల్లించిన ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా ఒక వ్యవస్థను రూపొందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు ఒకే బెర్త్ను పంచుకుంటున్నారు, అయితే రైల్వే మాత్రం ఇద్దరి నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈ పద్ధతి వినియోగదారులకు భారమని కమిటీ అభిప్రాయపడింది. IRCTC నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు టికెట్ క్యాన్సిల్ చేయకపోతే ఎటువంటి రీఫండ్ లభించదు. కానీ, ప్రయాణం చేస్తున్న సమయంలో బెర్త్ లభించని పక్షంలో ప్రయాణికులకు న్యాయం జరగడం లేదని కమిటీ తెలిపింది. దీనిపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రైల్వే కొన్ని కీలక మార్పులు చేపట్టింది. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ సహా మొత్తం 13 రైళ్లలో ఆర్ఏసీ ప్రయాణికులు బోర్డింగ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ రైళ్లలో కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారు మాత్రమే ప్రయాణించేలా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం