ATM: ఇక.. ఏటీఎంలు కనుమరుగేనా
డిజిటల్ చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో భారతదేశంలో ఏటీఎంల సంఖ్య తగ్గుతోందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎంలను తగ్గిస్తుండగా, ప్రభుత్వ బ్యాంకులు కూడా స్వల్పంగా తగ్గించాయి. అయితే వైట్ లేబుల్ ఏటీఎంలు మాత్రం పెరిగాయి. ఏటీఎంలు తగ్గుతున్నప్పటికీ, బ్యాంక్ శాఖల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
డిజిటల్ పేమెంట్లు పెరగటంతో మనదేశంలో డబ్బు విత్డ్రా చేసేందుకు ఉపయోగించే ఏటీఎం మిషన్ల సంఖ్య బాగా తగ్గుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య భారీగా తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్’ నివేదికలో వెల్లడించింది. మరోవైపు..నిర్వహణ ఖర్చులు పెరగడంతో భారీగా నష్టాలు రావటం, ఆన్లైన్ లావాదేవీలకు ప్రజలు మొగ్గుచూపుతుండటంతో అన్ని బ్యాంకులూ.. తమ ఏటీఎంల సంఖ్యను వీలున్నంత మేర తగ్గించుకుంటున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2023లో మొత్తం ఏటీఎంల సంఖ్య 2,19,281 కాగా, సెప్టెంబర్ 2024 నాటికి అది 2,15,767కి తగ్గింది. అంటే 1.6% మేర ఏటీఎంలు తగ్గాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎం నెట్వర్క్ను భారీగా కుదించుకున్నాయి. గత ఏడాది 79,884గా ఉన్న ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలు, ఈ ఏడాది 77,117కు తగ్గాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఈ సంఖ్య 1,34,694 నుంచి 1,33,544కు స్వల్పంగా తగ్గింది. ఆఫ్-సైట్ ఏటీఎంల మూసివేత ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, బ్యాంకేతర సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య మాత్రం 34,602 నుంచి 36,216కు పెరగడం విశేషం. ఇక ఏటీఎంల విస్తరణ విషయంలో.. ప్రభుత్వ బ్యాంకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా సేవలు అందిస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఎక్కువగా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఏటీఎంలు తగ్గుతున్నప్పటికీ, బ్యాంక్ బ్రాంచుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1.64 లక్షల బ్యాంకుల శాఖలున్నాయి. నిరుటితో పోలిస్తే ఇది 2.8 శాతం అధికం. కొత్త బ్రాంచుల ఏర్పాటులో ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే దూకుడుగా ఉన్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ధోనీ కారులో అది చూసి నెటిజన్లు షాక్.. వీడియో వైరల్
వీరు పాన్-ఆధార్ లింక్ చేయనక్కర్లేదా ??
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
