ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పెన్షనర్లకూ పండగే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. లక్షలాది మంది ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర కేబినెట్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలకు ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల చెల్లింపుల పెంపుపై ఈ కమిషన్ త్వరలో తన పని మొదలుపెట్టబోతోంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వేతన సంఘం ఒక తాత్కాలిక వ్యవస్థలా పనిచేస్తుంది. ఇందులో ఒక ఛైర్పర్సన్, ఒక పార్ట్టైమ్ సభ్యుడు, ఒక మెంబర్-సెక్రటరీ ఉంటారు. ఈ కమిషన్ తన నియామకం జరిగిన తేదీ నుంచి 18 నెలల్లోగా ప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే, తుది సిఫార్సులకు ముందే మధ్యంతర నివేదికలు కూడా ఇచ్చే వెసులుబాటును కల్పించారు. సిఫార్సులు చేసే సమయంలో కమిషన్ పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్దేశించింది. దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకత, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల లభ్యత వంటి అంశాలను పరిశీలించనుంది. అలాగే, ఈ సిఫార్సుల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో కూడా ఈ కమిటీ అంచనా వేయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల జీతభత్యాలు, పని పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగుల జీతభత్యాలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర సేవా నిబంధనలను సమీక్షించి, వాటిలో మార్పులను సూచించడం ఈ కమిషన్ ప్రధాన విధి. ఈ క్రమంలో, 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, దాని సిఫార్సులను ప్రభుత్వం 2016 జనవరి నుంచి అమలు చేసింది. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం 2025 జనవరిలో ప్రకటన చేసింది. తాజాగా కేబినెట్ ఆమోదంతో ఈ ప్రక్రియ అధికారికంగా ముందుకు సాగనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. క్షుద్ర పూజలకు ఇలాంటి జంతువును బలిస్తారా?
తుఫాను వేళ పాముల బీభత్సం.. వణికిపోతున్న జనం
తెలుగు రాష్ట్రాలకు IMD వార్నింగ్.. మరో 2 రోజులు మొంథా తుఫాన్ ఎఫెక్ట్
