ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు కీలక శుభవార్త అందించింది. రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో ఎంఎస్ నెం.45 జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి విధుల్లో చేరే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రతిపాదనకు అనుగుణంగా, ప్రభుత్వం తాజాగా జీవో ఎంఎస్ నెం.45 ను అధికారికంగా జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ నిర్ణయాన్ని 2022 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చేలా వర్తింపజేయడం విశేషం. తాజా ఉత్తర్వుల ప్రకారం.. 2022 జనవరి 1 తర్వాత 60 ఏళ్ల వయసు పూర్తికావడంతో పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను, అవసరమైన చోట్ల తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఈ జీవో ద్వారా అవకాశం లభించింది. ఇప్పటికే గతంలో కోర్టు ఉత్తర్వుల ఆధారంగా 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగిన ఉద్యోగులకు ఆ కాలాన్ని పూర్తిస్థాయి సర్వీసుగా పరిగణించి, అన్ని రకాల సర్వీస్ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత సంస్థలన్నీ తమ సర్వీస్ నిబంధనల్లో తగిన సవరణలు చేసుకుని ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం ఉద్యోగులకు కొన్ని ముఖ్యమైన కండిషన్లు వర్తిస్తాయి. ఉద్యోగి రిటైర్ అయిన తేదీ నుండి తిరిగి విధుల్లో చేరిన తేదీ వరకు ఉన్న కాలాన్ని ‘అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్’గా పరిగణిస్తారు. ఆ మధ్యంతర కాలానికి ఎలాంటి వేతనం లభించదు. వార్షిక ఇంక్రిమెంట్లు నోషనల్ ప్రాతిపదికన వర్తిస్తాయి. అయితే ఆ ఇంక్రిమెంట్ల అసలు ఆర్థిక ప్రయోజనం మాత్రం తిరిగి ఉద్యోగంలో చేరిన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. సీనియారిటీ, పదోన్నతులు వంటి అంశాల కోసం ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పటికే పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటెడ్ వాల్యూ, ఈఎల్ నగదు వంటి పదవీ విరమణ ప్రయోజనాలు పొంది, ఇప్పుడు తిరిగి విధుల్లో చేరాలనుకునే ఉద్యోగులు ఆ మొత్తాలను నిబంధనల ప్రకారం సంబంధిత సంస్థలకు తిరిగి జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి లేని ఉద్యోగులు ఉంటే, వారు 60 ఏళ్లకే పదవీ విరమణ పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా గతంలో వివిధ శాఖలు జారీ చేసిన ఆదేశాలు ఇకపై చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేయడంతో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై చాలా కాలంగా నెలకొన్న సందిగ్ధతకు పూర్తి స్థాయిలో తెరపడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
EPFO: ‘ఈపీఎఫ్ 2026’ కొత్త నిబంధనలు ఇవే!
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..
