నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి
సహారా ఎడారిలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు చెడిపోవడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీరు, ఆహారం లేక మండుటెండలో చిక్కుకున్న 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మాలీ నుంచి నైజర్కు బక్రీద్ వేడుకల కోసం వెళ్తున్న ఈ ప్రయాణికులు ఎడారిలోనే మరణించారు. ఇద్దరు సాహసోపేతంగా కాలినడకన వెళ్లి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. సహారా ఎడారిలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు మొరాయించింది. ముందుకు కదల్లేక నిలిచిపోయింది. దాహంతో అల్లాడుతూ తాగడానికి నీటి చుక్క దొరక్క 49 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు కాలినడకన సాహసోపేత ప్రయాణం చేసి అధికారులకు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే.. మాలీ నుంచి కొందరు… పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో బక్రీద్ జరుపుకునేందుకు ట్రక్కులో బయల్దేరారు. అయితే ట్రక్కు అస్సామాకా పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో.. సహారా ఎడారిలోని నిర్జన ప్రాంతంలో నిలిచిపోయింది. ట్రక్కు చెడిపోవడంతో డ్రైవర్, సహాయకులు, ప్రయాణికులు కలిసి మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చుట్టుపక్కల ఎక్కడా గ్రామం లేదు.. నీటి వనరు లేదు.. ఫోన్ సిగ్నల్ కూడా లేదు. దీంతో వాహనంలో ఉన్నవారు మండుటెండలో చిక్కుకుపోయారు. సహారా ఎడారిలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నీరు లేకపోతే మనిషి కొన్ని రోజులు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. మొదట నీటి నిల్వలు అయిపోయాయి. తర్వాత ఆహారం కూడా ముగిసింది. చివరకు దాహం, వేడి, అలసటతో ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు. అయితే ఇద్దరు వ్యక్తులు ప్రాణాల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 50 కిలోమీటర్లకుపైగా కాలినడకన ఎడారిలో నడిచి ఒక నీటి వనరు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అస్సామాకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతోనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రక్షక బృందాలు అక్కడికి చేరుకునే సరికి ట్రక్కు కింద, చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించాయి. మొత్తం 49 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి.. ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. అయితే రక్షక బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్ దృశ్యాన్ని చూశాయి. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి సుమారు 60 మంది మూడు రోజులుగా చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మరో భారీ విషాదం జరిగేదని అధికారులు తెలిపారు. కుటుంబాలతో ఈద్ చేసుకునేందుకు బయల్దేరిన 49 మంది ప్రయాణికుల ప్రయాణం… చివరకు ఎడారిలోనే ముగిసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అండమాన్లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు
Yash: ముంబై బీచ్లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!
బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్పై కొత్త రూల్స్..!
