Covid Vaccine Free : దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచితంగానే కరోనా వ్యాక్సిన్.. స్పష్టం చేసిన కేంద్రం
దేశ ప్రజలందరికీ కోవిడ్ టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. కోవిడ్ టీకా ప్రజల ఆరోగ్యం కోసమేనని.. ఈ విషయమై ఎలాంటి అపోహలను మనసులో పెట్టుకోవద్దని..
దేశ ప్రజలందరికీ కోవిడ్ టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. కోవిడ్ టీకా ప్రజల ఆరోగ్యం కోసమేనని.. ఈ విషయమై ఎలాంటి అపోహలను మనసులో పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ భద్రత, సమర్థత, రోగనిరోధకశక్తి పెంపుదలకు సంబంధించిన విషయాల్లో ఏ ఒక్కదానిపైనా రాజీపడేది లేదన్నారు. కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ సిఫారసులను డీసీజీఐ పరిశీలించి త్వరలోనే నిర్ణయం వెలువరిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా టీకా మెగా డ్రై రన్లో భాగంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాలను కేంద్ర మంత్రి సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S
— ANI (@ANI) January 2, 2021
విజయవంతంగా డ్రై రన్..
దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా రెండోవిడత మెగా డ్రై రన్ విజయవంతంగా సాగింది. 116జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేరళ, మహారాష్ట్ర మినహా అన్నిరాష్ట్రాలు ఆయా రాష్ట్రాల రాజధానులు, సమీప ప్రదేశాల్లో డ్రైరన్ నిర్వహించాయి. వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు కేంద్రం ఈ కార్యక్రమం నిర్వహించింది. డిసెంబర్ 28, 29 తేదీల్లో.. ఆంధ్రప్రదేశ్, అసోం, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రైరన్ లో వెల్లడైన లోటుపాట్లను సవరించారు. ఆయా రాష్ట్రాల్లో తలెత్తిన ఇబ్బందులు ఇప్పుడు రాకుండా చర్యలు తీసుకున్నారు.