గుడ్ న్యూస్: తెలంగాణలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో 178 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో 178 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో ఫేమ్– ఇండియా పథకం కింద రెండు దశల్లో ఈ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల స్థాపనకు తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSREDCO నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు కానుంది. ఇక, ఒకేసారి మూడు కార్లను చార్జ్ చేయగల ప్లగ్ పాయింట్లతో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఫేమ్–1లో హైదరాబాద్ ప్రాంతంలోని పట్టణ స్థానిక సంస్థల కోసం 118 స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వరంగల్లో 10, కరీంనగర్లో మరో 10 స్టేషన్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 138 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఈ స్టేషన్లన్నీ ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహి స్తారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్, ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఇవి నిర్వహించబడుతాయి. ఇక,ఫేమ్–2లో మరో 40 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కానున్నాయి. ఈ స్టేషన్లన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఏర్పాటు చేయనున్నారు.
ఎన్టీపీసీ సంస్థ ఆధ్వర్యంలో 32 ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు కానున్నాయి. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ సంస్థ 57, ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో 49 ఈవీసీ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వరంగల్, కరీంనగర్లో ఏర్పాటు చేసే 20 యూనిట్లను ఆర్ఈఐఎల్ నిర్వహిస్తుంది. ఫేజ్–2లో అనుమతి పొందిన 40 కేంద్రాల ఏర్పాటు బాధ్యత ఇంకా ఎవరికీ అప్పగించలేదు.
ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు నుంచి యూనిట్కు రూ.6 వసూలు చేయాలని నిర్ణయించాయి డిస్కమ్లు. అటు వినియోగదారుల నుంచి ఎంత వసూలు చేయాలన్నదీ ఇందుకు సంబంధించిన రేట్లను టీఎస్ఆర్ఈడీకో త్వరలో నిర్ణయించనుంది.