ఈ నగరంలో చికెన్, మటన్ మాత్రమే కాదు.. గుడ్లు అమ్మినా కేసే.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా!

భారతదేశంలోని ఒక చిన్న పట్టణం ప్రపంచంలో మరెక్కడా వినని ఒక ఘనతను సాధించింది. ఇక్కడ మాంసాహారం అమ్మడం చట్టరీత్యా నేరం. మరి ఈ నగరంలో గుడ్లు అమ్మినా కూడా ఎందుకు జైలుకు వెళ్తారు? ఇక్కడ శాకాహారం అనేది ఒక ఐచ్ఛికం కాదు, అదే చట్టం. 200 మంది జైన సన్యాసులు చేసిన నిరాహార దీక్షతో సాధించిన విజయం. జీవకారుణ్యానికి, అహింసకు ప్రతీకగా నిలిచిన ఈ నగరం గురించిన ఆసక్తికరమైన నిజాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి.

ఈ నగరంలో చికెన్, మటన్ మాత్రమే కాదు.. గుడ్లు అమ్మినా కేసే.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా!
World's First Meat Free City

Updated on: Jul 07, 2026 | 10:44 AM

భారతదేశంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. వారణాసి, రిషికేశ్ వంటి అనేక పవిత్ర, మతపరమైన నగరాలకు నిలయం. కొన్ని ప్రాంతాలు తమ ఆధ్యాత్మికతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటే, మరికొన్ని ప్రాంతాలు తమ ప్రత్యేక చట్టాలతో వార్తల్లో నిలుస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన నగరమే గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న పాలిటానా. ఈ నగరం ప్రపంచంలోనే మొట్టమొదటి చట్టబద్ధమైన సంపూర్ణ శాకాహార నగరంగా రికార్డు సృష్టించింది. ఇక్కడ మాంసం తినడం కానీ, విక్రయించడం కానీ పూర్తిగా నిషేధం. జీవకారుణ్యానికి, అహింసకు ప్రతీకగా నిలిచిన ఈ నగరం గురించిన ఆసక్తికరమైన నిజాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి.

పాలిటానా నగరంలో ఉన్న శత్రుంజయ్ పర్వతాలపై సుమారు 800 కంటే ఎక్కువ జైన్ దేవాలయాలు ఉన్నాయి. జైనుల మొదటి తీర్థంకరుడైన ఆదినాథుడు ఇక్కడే తపస్సు చేశారని నమ్ముతారు. అందుకే ఈ నగరాన్ని జైనులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. జైన్ మతం ప్రధాన సూత్రం అహింసో పరమో ధర్మః. ఏ జీవిని కూడా హింసించకూడదనేది ఈ మతం ముఖ్య ఉద్దేశం.

ఈ నగరంలో జంతు వధను, మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ 2014 లో సుమారు 200 మంది జైన్ సన్యాసులు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలో ఉన్న సుమారు 250 కసాయి దుకాణాలను మూసివేయాలని వారు పట్టుబట్టారు. సన్యాసుల పోరాటానికి, ప్రజల నమ్మకాలకు గౌరవం ఇస్తూ గుజరాత్ ప్రభుత్వం పాలిటానా నగర పరిధిలో మాంసం, గుడ్ల అమ్మకాలపై, జంతువులను వధించడంపై చట్టపరమైన పూర్తి నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

నగరంలోని కఠినమైన నియమాలు:

గుడ్లు కూడా నిషిద్ధం: పాలిటానాలో కేవలం చికెన్, మటన్ మాత్రమే కాదు, గుడ్లను విక్రయించడం లేదా వాడటం కూడా చట్టవిరుద్ధం. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని విక్రయిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయిన కసాయిల పునరావాసానికి జైన్ సంస్థలు సహాయం అందించాయి.

ప్రపంచవ్యాప్తంగా హరిత జీవనశైలి పై అవగాహన పెరుగుతున్న తరుణంలో, భారతదేశంలోని ఒక చిన్న నగరం ఒక దశాబ్దం క్రితమే అహింస, జీవకారుణ్యానికి నిదర్శనంగా నిలిచి గ్లోబల్ రికార్డు సృష్టించడం విశేషం. పర్యావరణ ప్రేమికులకు, ఆధ్యాత్మిక అన్వేషకులకు పాలిటానా ఒక ప్రత్యేకమైన గమ్యస్థానంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us