
పపువా న్యూగినియాలోని పోర్ట్ మోర్స్బీ అడ్వెంచర్ పార్క్లో ఒక ఎన్క్లోజర్ లోపల మొసలికి ఆహారంగా చికెన్ వేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆహారాన్ని లాక్కునే ప్రయత్నంలో ఆ మొసలి ఒక్కసారిగా కేర్ టేకర్ కాళ్లను నోటితో బంధించి నీటిలోకి లాక్కకెళ్లింది. దాదాపు గంటకు పైగా అతని కాళ్లను బంధించి ఉంచడంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. తోటి ఉద్యోగులు, సందర్శకులు ఎంత ప్రయత్నించినా అతన్ని మొసలి నోట్లో నుంచి విడిపించలేకపోయారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, కేర్ టేకర్ కొలను అంచును పట్టుకుని ఉండగా, మొసలి తన బలమైన దవడలతో అతని కాళ్లను పట్టుకుని లాగుతున్న దృశ్యం భయపెట్టేలా ఉంది. సందర్శకులు , తోటి సిబ్బంది అతడ్ని కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది .
” అతను భరించలేని నొప్పితో విలవిల్లాడాడు. కానీ గట్టిగా అరవలేకపోయాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఆ నొప్పినంతా అతడి కళ్ళలో స్పష్టంగా కనిపించింది. అతను మాట్లాడిన మాటల్లో నాకు ఒక్కటే వినబడింది… ‘నేనేం తప్పు చేయలేదు’ అని మాత్రమే అతను అన్నాడని స్థానికుడొకరు తెలిపారు.
పార్క్లోని సెక్యూరిటీ గార్డుల వద్ద కాల్పులు జరిపేందుకు తుపాకులు అందుబాటులో లేకపోవడంతో, రక్షణ కోసం వారు బాధితుడికి కేవలం ఒక చిన్న ఇనుప రాడ్డును మాత్రమే ఇచ్చారు. చివరకు పోలీసులు వచ్చి మొసలిని కాల్చి చంపి బాధితుడిని బయటకు తీశారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది.
తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్’కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరుసటి రోజు సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, పార్క్ యాజమాన్యం ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పార్క్ను తాత్కాలికంగా మూసివేశారు.