
చెన్నైలోని హోసూర్ నాగమంగళంలో ఉన్న మహిళా హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాల కలకలం రేపింది. ఓ మహిళ ఆమె బాయ్ ఫ్రెండ్ సూచనల మేరకు ఈ కెమెరాలను అమర్చినట్టుగా తెలుస్తోంది. సదరు మహిళ, ఆమె బాయ్ ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణగిరి జిల్లాలోని నాగమంగళంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేడీస్ హాస్టల్ భవనంలో సుమారు 6 వేల మందికిపైగా మహిళలు ఉంటున్నారు. ఒడిశాకు చెందిన 22 ఏళ్ల నీలుకుమారి గుప్తా.. ఆమె బాయ్ ఫ్రెండ్ సంతోష్(25) ఇచ్చిన సూచనల మేరకు హాస్టల్లోని బాత్రూంలో రహస్య కెమెరాలను అమర్చింది. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలపగా.. ఆపై వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ విషయం బయటకు రాగానే హాస్టల్లోని ఇతర యువతులు నిరసనకు దిగారు. వారి భద్రత, గోప్యతకు హామీ ఇస్తూ.. కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. భవనంలో మరెక్కడైనా రహస్య కెమెరాలు అమర్చారా.? లేదా.? అనే విషయంపై పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు.. ఇద్దరు మహిళా పోలీసులను అక్కడ డ్యూటీలో ఉంచినట్టు పోలీస్ అధికారి తెలిపారు.