
భారతీయ ప్రాచీన వారసత్వ సంపదను విదేశాల నుండి తిరిగి రప్పించే ప్రక్రియలో మరో కీలక విజయం నమోదైంది. అమెరికాలోని ప్రముఖ స్మగ్లర్ సుభాష్ కపూర్ నెట్వర్క్పై జరిపిన దర్యాప్తులో లభించిన 657 పురాతన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం అధికారికంగా భారతదేశానికి తిరిగి అప్పగించింది. వీటి మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 1.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 11.6 కోట్లు) ఉంటుందని అంచనా. ప్రముఖ ఆర్ట్ డీలర్గా చలామణి అయిన సుభాష్ కపూర్, కొన్ని దశాబ్దాలుగా భారత్, ఇతర ఆసియా దేశాల నుండి అరుదైన విగ్రహాలను, పురాతన వస్తువులను అక్రమంగా తరలించి అమెరికాలోని మ్యూజియాలకు, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేవాడు. అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, న్యూయార్క్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ హిడెన్ ఐడల్ (Operation Hidden Idol)లో భాగంగా ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయింది.
అప్పగించిన ఈ 657 వస్తువులలో వివిధ చారిత్రక కాలాలకు చెందిన అరుదైన కళాఖండాలు ఉన్నాయి. ముఖ్యంగా రాతితో చెక్కిన పురాతన విగ్రహాలు, నగిషీలు అద్దిన వెండి వస్తువులు, అరుదైన టెర్రకోట (మట్టి) బొమ్మలు, పురాతన నాణేలు, ఆభరణాలు ఉన్నాయని సమాచారం.
న్యూయార్క్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా అధికారులు ఈ వస్తువులను భారత రాయబార కార్యాలయ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా అమెరికా అధికారులు మాట్లాడుతూ.. చారిత్రక సంపద ఒక దేశం ఆత్మ వంటిది. దొంగిలించబడిన ఈ సంపదను తిరిగి దాని స్వదేశానికి పంపడం మా బాధ్యత అని పేర్కొన్నారు.
గత కొన్ని ఏళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న మన పురాతన విగ్రహాలను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక చొరవ చూపుతోంది. తాజా పరిణామంతో మన దేశ సాంస్కృతిక వైభవం మరోసారి స్వదేశానికి చేరుకుంది. ఈ అరుదైన కళాఖండాలను త్వరలోనే భారత్కు తరలించి, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో భద్రపరచనున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…