
అమెరికాలోని ఇడహో నివాసి అయిన క్రిస్ హావర్త్ తన భార్యాపిల్లలతో కలిసి కాలిఫోర్నియాలోని ఓరోవిల్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంటి వెనుక ఉన్న తోటలో నడుస్తుండగా, ప్రమాదవశాత్తు ఒక చెక్క ముక్క అనుకుని విషపూరితమైన రటిల్స్నేక్ పై కాలు వేశాడు. ఆ పాము వెంటనే క్రిస్ను రెండు సార్లు గట్టిగా కాటేసింది. పాము కరిచిన కొద్ది నిమిషాల్లోనే క్రిస్ శరీరం మొత్తం వాచిపోయింది. నాలుక మొద్దుబారి, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయాయి.
అంతేకాకుండా అతని శరీరంలో రక్తం గడ్డకట్టే DIC అనే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతని ప్రాణాలు కాపాడటానికి నిరంతరాయంగా యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. క్రిస్ శరీరంలో విషం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏకంగా 54 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వచ్చింది. దీనితో ఆ ఆసుపత్రిలో ఉన్న యాంటీ-వెనమ్ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. పరిస్థితి విషమించడంతో ఆయన్ను హెలికాప్టర్ ద్వారా స్టాన్ఫోర్డ్ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడ 12 రోజుల పాటు ఐసీయూలో మృత్యువుతో పోరాడి క్రిస్ ప్రాణాలతో బయటపడ్డాడు.
క్రిస్ ప్రాణాలైతే నిలిచాయి కానీ, ఆసుపత్రి డిశ్చార్జ్ బిల్లు చూసి ఆ కుటుంబం నోరెళ్లబెట్టింది. రెండు ఆసుపత్రుల ఖర్చు కలిపి మొత్తం 13 లక్షల డాలర్లు (దాదాపు రూ. 11 కోట్లు) అయింది. అమెరికాలో ఒక యాంటీ-వెనమ్ ఇంజెక్షన్ ధర సుమారు 13,000 డాలర్లు (రూ. 11 లక్షలకు పైగా) ఉంటుంది. క్రిస్కు 54 ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల కేవలం మందులకే భారీగా ఖర్చయింది. దీనికి తోడు స్టాన్ఫోర్డ్ ఐసీయూలో ఒక రాత్రి బసకు 61,000 డాలర్లు (సుమారు రూ. 50 లక్షలు) వసూలు చేశారు.
ప్రస్తుతం క్రిస్ 80 శాతం కోలుకున్నప్పటికీ, కాలి నొప్పుల వల్ల ఇంకా పూర్తిగా పనిలోకి వెళ్లలేకపోతున్నాడు. ఆ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, అందులో ఎంత మొత్తం మినహాయింపు లభిస్తుంది, వీరు జేబు నుండి ఎంత కట్టాలి అనే దానిపై స్పష్టత లేదు. తోటలు, అడవుల వంటి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..