
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఒక దిగ్భ్రాంతికరమైన నేర వృత్తాంతం ఇంగ్లాండ్ దేశంలో వెలుగుచూసింది. సాధారణంగా పిల్లలు జూకు వెళితే జంతువులను చూసి ఎంతో సంబరపడతారు. కానీ, యుకెలోని కేంబ్రిడ్జ్షైర్ ప్రాంతంలో ఉన్న జాన్సన్స్ ఆఫ్ ఓల్డ్ హర్స్ట్ జూకు వెళ్లిన ఒక కుటుంబానికి కలలో కూడా ఊహించని భయంకరమైన అనుభవం ఎదురైంది. అక్కడ అమాయకంగా నిలబడి ఉన్న ఒక మూడేళ్ల బాలుడిని, ఒక క్రూరుడు ఉన్నట్టుండి మొసళ్లు ఉన్న 15 అడుగుల లోతైన బోనులోకి తోసేశాడు.
పోలీసుల సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 1:24 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బాలుడు మొసళ్ల బోనులో పడగానే పెద్ద పెట్టున కేకలు వేశాడు. ఆ శబ్దాలు విన్న జూ సిబ్బంది, అక్కడే ఉన్న జూ యజమాని భార్య ట్రేసీ జాన్సన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాహసించి ప్రాణాలకు తెగించి ఆ మొసళ్ల బోనులోకి దూకారు. అక్కడ ఆఫ్రికన్ నైల్ జాతికి చెందిన ప్రమాదకరమైన మొసళ్లు ఉన్నప్పటికీ, వారు చాకచక్యంగా వ్యవహరించి మొసళ్లు దాడి చేయకముందే బాలుడిని బయటకు తీసుకువచ్చారు. అయినప్పటికీ, అంత ఎత్తు నుంచి కింద పడటం వల్ల బాలుడి కంటికి, చేతికి, కటి వలయం (Pelvis) ఎముకలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా కేంబ్రిడ్జ్లోని అడెన్బ్రూక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘాతుకానికి ఒడిగట్టిన 30 ఏళ్ల నార్ఫోక్ (Norfolk) ప్రాంతానికి చెందిన వ్యక్తిని పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. మేజర్ క్రైమ్ యూనిట్ ఈ కేసును హత్యాయత్నం (Attempted Murder) కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే విచారణలో తేలిందేమిటంటే, నిందితుడికి, ఆ చిన్నారి కుటుంబానికి ఎలాంటి పరిచయం, వివాదం లేదు. అతను పూర్తిగా ఒక అపరిచితుడు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ప్రస్తుతం అతన్ని విచారించడానికి వీలు పడలేదని, అందువల్ల అతనికి బెయిల్ మంజూరు చేసి సెప్టెంబర్ వరకు తదుపరి విచారణను వాయిదా వేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ భయంకరమైన ఘటనతో జూలోని ట్రాపికల్ హౌస్ (సరీసృపాల విభాగం)ను తాత్కాలికంగా మూసివేశారు. కేవలం క్షణాల వ్యవధిలో ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన జూ మహిళా యజమానిపై స్థానికులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..