హైవేలపై కార్లు దగ్ధమవుతున్న సంఘటనలు ఇటీవల చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తీవ్రమైన ఎండలు, పెట్రోల్ ట్యాంకులో లోపాలు కారణం ఏదైనా కార్లలో మంటలు రావడం అందరినీ భయాందోళనకు గురి చేస్తాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనల్లో పలువురు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్లో రాయల్ ఎన్ఫీల్డ్ పేలిన సంఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా కాస్తలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
హైదరాబాద్లోని బీబీ బజార్లో రోడ్లో ఉన్న మొఘల్పురా ప్రాంతంలో ఓ వ్యక్తి రాయల్ఎన్ఫీల్డ్ను పార్క్ చేశాడు. అంతలోనే ఉన్నపలంగా ఒక్కసారిగా బైక్లో మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న కొందరు పోలీసులు, యువకులు బ్యాక్ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అంతలోనే బైక్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ మంటల్లో చిక్కుకుపోయాడు. అయితే స్థానికులు అలర్ట్ కావడంతో ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
ఇదంతా అక్కడే ఉన్న కొందరు స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బైక్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండలు మండిపోతున్న తరుణంలో పెట్రోల్ లీకింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..