
కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉంటే మనిషి ఏ స్థాయికైనా ఎదగగలరని నిరూపించింది ఒక మహిళా పైలట్. తను కన్న కలలను నిజం చేసుకుని పైలట్ యూనిఫాంలో తన అమ్మమ్మను విమాన ప్రయాణం చేయించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కదిలిస్తోంది. సాధారణంగా పైలట్లు ప్రయాణికులకు వాతావరణం, ప్రయాణ సమయం గురించి సమాచారం ఇస్తారు. కానీ ఈ వీడియోలో, మహిళా పైలట్ అనౌన్స్మెంట్ చేస్తూ తన అమ్మమ్మ గురించి ప్రస్తావించారు. నేను చిన్నప్పటి నుండి పైలట్ అవ్వాలని కలలు కన్నాను. ఈరోజు నేను ఈ విమానాన్ని నడుపుతుంటే, నా వెనుక సీట్లో కూర్చుని నా అమ్మమ్మ నన్ను చూస్తోంది. ఇది నా జీవితంలో మర్చిపోలేని క్షణం అని ఆమె చెప్పారు.
తన మనవరాలిని పైలట్ సీట్లో చూసి, ఆమె గొంతును స్పీకర్లో విన్న ఆ వృద్ధురాలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. విమానం క్యాబిన్ అంతా ప్రయాణికుల చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ మనవరాలు తన కాక్పిట్ నుండి బయటకు వచ్చి అమ్మమ్మను ఆలింగనం చేసుకున్న దృశ్యం వీడియోలో హైలైట్గా నిలిచింది. పిల్లలు సెటిల్ అయ్యి తమ పెద్దలను ఇలా గౌరవించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఇది ఈ ఏడాదికి బెస్ట్ వీడియో అని మరొకరు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు, కుటుంబ విలువల కలయికకు ఈ వీడియో ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది.
కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా, తన మూలాలను మర్చిపోకుండా పెద్దలను గౌరవించిన ఈ పైలట్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ వీడియో చూస్తుంటే “తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదమే మన విజయానికి పునాది అనే మాట మరోసారి నిజమనిపిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..