
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ వందల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో జరగబోయే వినాశనాలను, కీలక పరిణామాలను అంచనా వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ప్రవక్త మైఖేల్ డి నోస్ట్రాడమస్. 1555లో ఆయన రాసిన ప్రవచనాలు అనే గ్రంథంలో 942 సంక్లిష్టమైన కవితల రూపంలో భవిష్యవాణిని పొందుపరిచారు. గతంలో హిట్లర్ ఎదుగుదల, ప్రపంచ యుద్ధాలు, హిరోషిమా-నాగసాకి అణుదాడుల వంటి నోస్ట్రాడమస్ జోస్యాలు నిజమయ్యాయని చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలోనే ప్రస్తుత 2026 సంవత్సరానికి సంబంధించి ఆయన చేసిన కొన్ని భయంకరమైన ప్రవచనాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
నోస్ట్రాడమస్ తన పుస్తకంలోని నూత్రాండు 1లో గల 26వ శ్లోకంలో ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని రాశారు. ఒక ప్రముఖ వ్యక్తి పగటిపూట ఆకాశం నుండి పడే పిడుగుపాటుకు గురై మరణిస్తాడని అందులో ఉంది. దీనిని విశ్లేషిస్తున్న నిపుణులు.. 2026లో ప్రపంచాన్ని శాసించే ఒక దేశాధ్యక్షుడు, మహారాజు లేదా అత్యంత ప్రజాదరణ పొందిన ఒక గొప్ప వ్యక్తి హఠాన్మరణానికి గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా అనే భయాలు అందరిలో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే.. 2026లో ఒక భయంకరమైన యుద్ధం వస్తుందని, అది ఏడు నెలల పాటు నిరంతరాయంగా సాగుతుందని నోస్ట్రాడమస్ హెచ్చరించారు. ఈ యుద్ధంలో దుష్టశక్తుల చేతిలో లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారని ఆయన రాశారు.
నోస్ట్రాడమస్ ప్రవచనాల ప్రకారం.. అర్ధరాత్రి వేళ ఒక పెద్ద తేనెటీగల గుంపు మాటువేసి దాడి చేస్తుంది. ఈ విచిత్రమైన వాక్యంలో 26 అనే సంఖ్య ప్రస్తావన ఉండటంతో దీన్ని 2026 సంవత్సరంతో ముడిపెడుతున్నారు. అయితే కేవలం తేనెటీగలు ప్రపంచానికి అంత పెద్ద నష్టాన్ని ఎలా కలిగిస్తాయి? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే.. ఆధునిక యుద్ధాల్లో వాడే ప్రాణాంతక డ్రోన్ల సమూహం లేదా అధునాతన క్షిపణుల దాడికి నోస్ట్రాడమస్ తేనెటీగల గుంపు అనే రహస్య సంకేతాన్ని వాడి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంగా పేరొందిన స్విట్జర్లాండ్కు సంబంధించి కూడా ఒక అశుభ వార్త నోస్ట్రాడమస్ ప్రవచనాల్లో ఉంది. ఒక నిర్దిష్ట నగరం చేసే పెద్ద తప్పు వల్ల, అక్కడి టిసినో నది మానవ రక్తంతో పూర్తిగా ఎర్రగా మారుతుందని ఆయన రాశారు. ఈ రక్తపాతం వెనుక ఒక పెద్ద మారణకాండ గానీ, ఊహించని వినాశకర ప్రకృతి వైపరీత్యం గానీ లేదా ముంచెత్తే ఘోరమైన అంటువ్యాధి గానీ కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రవచనాలు ప్రజలను భయపెట్టేవిగా ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు, హేతువాదులు మాత్రం వీటిని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. నోస్ట్రాడమస్ ఈ జోస్యాలను పాత ఫ్రెంచ్ భాషలో, చాలా అస్పష్టంగా రాశారని.. ప్రపంచంలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు, ప్రజలు ఆ కవితలను తమకు నచ్చినట్లుగా, తమ సౌలభ్యం ప్రకారం అన్వయించుకుని నిజమయ్యాయని ప్రచారం చేసుకుంటారని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు.