Viral Video: విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై దాడి .. బైక్‌లపై 20KM కార్‌ను చేజ్ చేసిన పోకిరీలు

మహారాష్ట్రలో ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. నాసిక్‌లోని ఓ ప్రసిద్ధ జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఒక కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని వెళ్తున్న ఆ కుటుంబాన్ని సుమారు 20 కిలోమీటర్ల మేర బైక్‌లపై వెంబడించి భయభ్రాంతులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనతో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Viral Video: విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై దాడి .. బైక్‌లపై 20KM కార్‌ను చేజ్ చేసిన పోకిరీలు
Nashik Waterfall Family Attack

Updated on: Jul 15, 2026 | 1:36 PM

నాసిక్‌లో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కొందరు వ్యక్తులు ఆ కుటుంబాన్ని 20 కిలోమీటర్ల దూరం వెంబడించి, రాడ్లు, కర్రలతో వారి కారుపై దాడి చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యుల కుటుంబం.. ఇగత్‌పురి పట్టణంలోని భావ్లీ డ్యామ్ వద్ద ఉన్న జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చింది. అయితే అక్కడున్న కొందరు పోకిరీలు ఆ కుటుంబంలోని ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, పక్కనే ఉన్న షాప్ వారు కూడా నిందితులతో కలిసి తమపైకి వచ్చారని వారు తెలిపారు. ఎలాగోలా పరిస్థితిని సద్దుమణిగించి అక్కడి నుంచి బయటపడ్డామని చెప్పారు.

అయితే వారు కారులో అక్కడి నుంచి బయల్దేరి వచ్చినా దుండగులు వదల్లేదు. సుమారు 8 నుంచి 10 మంది బైక్‌లపై కారును చేజ్ చేస్తూ, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. సుమారు 20 కిలోమీటర్ల మేర వెంబడించి, కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో నలుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారని, తాము ఎంతో భయపడిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కారులో ఉన్న కొందరు ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దాడికి పాల్పడిన మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us