
రైలు వేగం పుంజుకుంటోంది.. కానీ ఆ తల్లి గుండె వేగం అంతకంటే ఎక్కువైంది. కళ్లముందే కొడుకును తీసుకుని వెళ్ళిపోతున్న ఆ రైలును ఎక్కేందుకు, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమె చేసిన సాహసం ఇప్పుడు ఇంటర్నెట్ను కదిలిస్తోంది. మాతృత్వపు మమకారానికి, ఆరాటానికి అద్దం పడుతున్న ఈ హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా, ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నా.. కన్నప్రేమ ముందు ఏ భయాలూ నిలవవని నిరూపించే సంఘటన ఒకటి ఓ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం.. ఒక మహిళ స్టేషన్ ప్లాట్ఫారమ్పై వేగంగా కదులుతున్న రైలును అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రైలు వేగం పుంజుకుంటున్నా సరే, ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా దానితో పాటే పరుగెడుతూ, ఎలాగైనా లోపలికి ఎక్కాలని ఆరాటపడింది. ఆమె కళ్లలో భయం, గుండెల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ना कोई स्टंट…ना कोई रीलबाजी…
बस एक मां की हिम्मत…😟
क्योंकि उसका बेटा उस ट्रेन में था… pic.twitter.com/cmyLt69ZdA— Devyani Chauhan (@ChauhanDevyani7) June 7, 2026
ఆమె అంతలా ప్రాణాలకు తెగించి పరుగెత్తడానికి గల కారణం తెలిసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ సమయంలో ఆమె కుమారుడు అప్పటికే రైలు ఎక్కి లోపల ఉన్నాడట. కొడుకును ఒంటరిగా వదిలేసి తను వెనుకబడిపోతాననే భయంతో, ఆ తల్లి మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. రైలు వేగం పెరుగుతున్నా సరే.. తన కొడుకు దగ్గరకు వెళ్లాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఆమె అలా ప్లాట్ఫారమ్పై పరుగులు తీసింది. ఒక తల్లి తన బిడ్డ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందని ఈ దృశ్యం నిరూపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వందలాది లైకులు, వేలాది వ్యూస్తో దూసుకుపోతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అమ్మ ప్రేమకు ఉన్న శక్తి ఇదే.. బిడ్డ కోసం ప్రాణాలనైనా ఇస్తుంది” అంటూ చాలా మంది ఆమె మాతృత్వాన్ని, ధైర్యాన్ని కొనియాడుతున్నారు. క్లిష్ట సమయాల్లో ఒక తల్లికి వచ్చే సహజమైన శక్తి ఇదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, ఈ ఘటనపై కేవలం ప్రశంసలు మాత్రమే కాదు, తీవ్రమైన ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. “ఆమె చేసిన ఆరాటాన్ని అర్థం చేసుకోగలం, కానీ ఇది అత్యంత ప్రమాదకరం. ఒక్క అడుగు తప్పినా రైలు కింద పడి ప్రాణాలు పోయేవి” అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అత్యవసర సమయాల్లో కదిలే రైలును పట్టుకోవడానికి ప్రయత్నించే కంటే, వెంటనే అక్కడున్న రైల్వే సిబ్బందిని లేదా గార్డును కలిసి రైలును ఆపమని కోరడం సురక్షితమైన మార్గమని నెటిజన్లు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..