పాఠశాల అంటే విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునే దేవాలయం.. కానీ అలాంటి పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు చేస్తున్న పనులు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిని దుర్వినియోగం చేస్తున్న వీడియోలు ఈమధ్య మనం సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం.. తాజాగా ఇలాంటి సంఘటన ఒక్కటి నెటింట్లో చక్కర్లు కొడుతుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో నేలపై పడుకుని ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయంచుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో చోటుచేసుకుంది.
కర్తార్పూర్లోని ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు నేలపై పడుకుని ఉండగా, విద్యార్థులు ఆమెపై నిలబడి కాళ్లకు మసాజ్ చేస్తున్న ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. టీచర్ పిల్లలతో మసాజ్ చేయించుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పిల్లలతో మాసాజ్ చేయించుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు. టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై పలువురు ఉపాధ్యాయులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాజాగా ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజు చౌదరి స్పందించింది. ఈ వైరల్ అవుతున్న వీడియోను తాను కూడా చూసినట్లు తెలిపారు. టీచర్ అనారోగ్యంతో ఉండవచ్చని, తన పాదాలకు మసాజ్ చేయమని పిల్లలను అభ్యర్థించి ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే విచారణ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
स्कूल टीचर का वीडियो हुआ वायरल. pic.twitter.com/ReTUYkEPoj
— Prashant rai (@prashantrai280) October 10, 2024