విమానంలో దెయ్యం.. గాల్లో ఉండగానే డోర్ తీసేందుకు యత్నం.. అసలేం జరిగిందంటే..?

గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అలాంటిది వారణాసి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడ్డాడు. ల్యాండింగ్‌కు కొద్ది క్షణాల ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను లాగేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. విచారణలో అతడు చెప్పంది విని అంతా అవాక్కయ్యారు.

విమానంలో దెయ్యం.. గాల్లో ఉండగానే డోర్ తీసేందుకు యత్నం.. అసలేం జరిగిందంటే..?
Indigo Passenger Tries To Open Emergency Exit Door

Updated on: Mar 30, 2026 | 5:20 PM

విమానం ల్యాండ్ కావడానికి మరికొన్ని క్షణాలే ఉంది.. ప్రయాణికులంతా తమ సీట్ బెల్టులు పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రయాణికుడు చేసిన పని విమానంలోని 100 మంది ప్రాణాలను గాలిలో కలిపేంత ప్రమాదకరంగా మారింది. బెంగళూరు నుంచి వారణాసి వస్తున్న ఇండిగో విమానంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. బెంగళూరు నుంచి వారణాసికి వస్తున్న ఇండిగో ఫ్లైట్ శనివారం రాత్రి 10:20 గంటల సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి సిద్ధమైంది. విమానం రన్‌వేకు చేరువలో ఉండగా, 26 ఏళ్ల మహమ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడు ఒక్కసారిగా లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవడానికి ప్రయత్నించాడు.

ఈ విషయాన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ల్యాండింగ్‌ను మధ్యలోనే నిలిపివేసి, విమానాన్ని తిరిగి గాల్లోకి ఎగరవేశారు. దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 15 నిమిషాల తర్వాత రాత్రి 10:35 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

విచారణలో వింత సమాధానాలు

విమానం ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని సీఐఎస్‌ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాయి. విచారణ సమయంలో నిందితుడు చెప్పిన మాటలు విని అధికారులు విస్తుపోయారు. మొదట తనకు దెయ్యం పట్టిందని, అందుకే అలా చేశానని పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత మాట మార్చి, ఆ బటన్ నొక్కితే విమానం తలుపు తెరుచుకుంటుందని తనకు తెలియదని బుకాయించాడు.

నమోదైన కేసు.. కొనసాగుతున్న దర్యాప్తు

నిందితుడు మహమ్మద్ అద్నాన్‌పై ఇండిగో సెక్యూరిటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఫూల్‌పూర్ పోలీసులు సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. అయితే ప్రాథమిక విచారణ అనంతరం అతడికి నోటీసు జారీ చేసి తల్లిదండ్రులకు అప్పగించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆకాష్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. విమానం గాల్లో ఉండగానే తలుపు తీసే ప్రయత్నం జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే విమానం గాలి పీడనానికి కుప్పకూలిపోయేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us