
హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలసిన ఉత్తరాఖండ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పంచ కేదారాలు..కేదారనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పనాథ్ శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు. పంచ కేదారాలలో నాల్గవ స్థానమైన మధ్యమహేశ్వర్ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. సుందరమైనది. మధ్యమహేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో కొలువై ఉంది. ఇక్కడ పరమశివుని నాభి భాగం లింగరూపంలో పూజించబడుతుంది. ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఎలా వెళ్లాలి..? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హిమాలయాల ఒడిలో ఉండే ఈ ఆలయంలో శివుని నాభి భాగం పూజించబడుతుంది. ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రకు హరిద్వార్ లేదా రుద్రప్రయాగ్ మీదుగా ఉఖీమఠ్ చేరుకోవాలి. అక్కడి నుండి ఉన్నాణా వరకు వాహనాల్లో వెళ్లి, ఆపై దట్టమైన అడవులు, జలపాతాలు, నదుల గుండా సుమారు 16-18 కిలోమీటర్ల కష్టతరమైన ట్రెకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సాహసయాత్రలను కోరుకునే పర్యాటకులకు, శివభక్తులకు ఈ మధ్యమహేశ్వర్ యాత్ర ఒక అద్భుతమైన అనుభవం.
హరిద్వార్ నుండి రుద్రప్రయాగ్, గుప్తకాశి మీదుగా ఉఖీమఠ్ వరకు బస్సు లేదా టాక్సీలో ప్రయాణించాలి (సుమారు 200 కిలోమీటర్లు). శీతాకాలంలో మధ్యమహేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠ్లోనే ఉంచి పూజిస్తారు. ఉఖీమఠ్ నుండి ట్రెకింగ్ ప్రారంభ స్థానమైన రాంసీ గ్రామానికి స్థానిక వాహనాల ద్వారా చేరుకోవాలి. రాంసీ నుండి అసలైన ట్రెకింగ్ ప్రారంభమవుతుంది. ఈ కాలినడక మార్గం ఉన్నాణా, గౌండార్, ఖట్వారా గ్రామాల మీదుగా సాగుతుంది. లోయలు, జలపాతాలు, నదులు, పచ్చిక బయళ్ళు గుండా సాగే ఈ ట్రెకింగ్ కాస్త కష్టతరమైనప్పటికీ, ప్రకృతి సౌందర్యం అలసటను మర్చిపోయేలా చేస్తుంది.
ప్రతి ఏటా మే నెలలో ఆలయ తలుపులు తెరుచుకుని, నవంబర్ కార్తీక మాసంలో శీతాకాలం ప్రారంభమయ్యే సమయానికి మూసివేస్తారు. మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ఈ యాత్రకు అత్యంత అనుకూలమైన సమయం. ట్రెకింగ్ చాలా ఎత్తులో ఉంటుంది. కాబట్టి శారీరక ఫిట్నెస్ తప్పనిసరి. చలి దుస్తులు, రెయిన్ కోట్, ప్రాథమిక ఔషధాల కిట్ వెంట ఉంచుకోవాలి. దారిలో ఉండే హోమ్స్టేలు లేదా ఆశ్రమాలు విశ్రాంతికి అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక నిశ్చలత, సాహసోపేతమైన హిమాలయ దృశ్యాలను ఆస్వాదించాలనుకునే వారికి మధ్యమహేశ్వర్ ట్రెకింగ్ ఒక మరువలేని జీవితకాల అనుభూతిని అందిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..