
భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటం సహాయక బృందాలకు అతిపెద్ద సవాలు. మనుషులు లేదా పెద్ద రోబోలు వెళ్లలేని అత్యంత ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు జీవశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ కలయికతో సైబోర్గ్ బొద్దింకలు అనే వినూత్న విపత్తు నిర్వహణ సాంకేతికతను రూపొందించారు. సైబోర్గ్ బొద్దింకలు ఎలా పనిచేస్తాయి?
భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు సైబోర్గ్ బొద్దింకలను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతలో ప్రాణమున్న బొద్దింకల వీపుపై అతి చిన్న ఎలక్ట్రానిక్ బ్యాక్ప్యాక్ అమర్చుతారు. ఈ పరికరానికి ఉండే సన్నని ఎలక్ట్రోడ్లను బొద్దింక స్పర్శ శృంగాలు, శరీర వెనుక భాగాలకు అనుసంధానిస్తారు. శాస్త్రవేత్తలు లేదా పారామెడికల్ సిబ్బంది సిగ్నల్స్ పంపడం ద్వారా ఆ బొద్దింక ఏ దిశలో వెళ్లాలో రిమోట్ ద్వారా సులువుగా సూచించగలరు.
ఈ బ్యాక్ప్యాక్లకు అమర్చిన ఫ్లెక్సిబుల్ సోలార్ సెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల బొద్దింక శరీర బరువు పెరగకుండా నిరంతరం పని చేస్తుంది. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కూలిపోయిన కాంక్రీట్ శిథిలాల మధ్య చిన్న సందులు మాత్రమే ఉంటాయి. సైబోర్గ్ బొద్దింకలు ఈ చిన్న సందుల గుండా సులువుగా ప్రవేశించగలవు. ఈ పరికరాలలో అమర్చే మైక్రో సెన్సార్లు, కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ సహాయంతో శిథిలాల కింద మనుషుల ఉనికిని, శరీర వేడిని గుర్తిస్తాయి.
ఇవి అక్కడ ఆక్సిజన్ స్థాయిలు ఎలా ఉన్నాయి, చుట్టూ ఉన్న వాతావరణం సురక్షితమేనా అనే సమాచారాన్ని బయట ఉన్న రెస్క్యూ బృందాలకు తక్షణమే పంపుతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, సాంప్రదాయ రోబోలతో పోలిస్తే జీవించి ఉన్న బొద్దింకలను ఉపయోగించడం వల్ల తక్కువ శక్తి ఖర్చవుతుంది. అత్యంత కఠినమైన భూభాగాల్లోనూ ఇవి సులువుగా కదలగలవు. ఈ సైబోర్గ్ పరిజ్ఞానం భవిష్యత్తులో విపత్తు సమయంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..