
రద్దీగా ఉండే రోడ్డుపై అకస్మాత్తుగా ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. అందరూ చూస్తుండగానే నడి రోడ్డులోని కొంత భాగం అమాంతంగా భూమిలోకి కుంగిపోయింది. ఆ ప్రాంతంలో పెద్ద సింక్ హోల్ ఏర్పడింది. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అనూహ్య సంఘటన చైనాలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా నేల కుంగిపోతుండటంతో అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు.
చైనాలోని షాంఘైలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. రద్దీగా ఉండే రోడ్డు అకస్మాత్తుగా గుంతలమయమై, భారీ సింక్ హోల్ ఏర్పడింది. చైనాలోని అత్యంత ఆధునిక నగరంలో రద్దీగా ఉండే రోడ్డు క్షణాల్లో భూమిలోకి కుంగిపోతున్న దృశ్యాలు రోడ్డు పక్కన ఉన్న కెమెరాలో రికార్డైంది. ఫిబ్రవరి 12న ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త మెట్రో రైలు కోసం టన్నెల్ నిర్మాణపనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే సంబంధిత సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని.. శిథిలాల తొలగింపు చేపట్టారు. ఆ రోడ్డును పూడ్చే పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముందస్తుగా సమీపంలోని కార్యాలయాలు, అపార్ట్మెంట్లను తాత్కాలికంగా ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
A massive sinkhole has opened up, swallowing a key section of roadway in Shanghai, China. pic.twitter.com/cHqpihXZzQ
— Open Source Intel (@Osint613) February 12, 2026
చైనాలోని మిన్హాంగ్ జిల్లాలో గతంలో ఇలాంటి సంఘటనే జరిగింది. 2024లో మురుగునీటి పైపు లైను పగిలిపోవడంతో మిన్హాంగ్ జిల్లాలోని ఓ రోడ్డులో కొంత భాగం కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఇలాంటి జరగటం ప్రకృతి వైపరీత్యం కాదు, కానీ, వేగవంతమైన పట్టణీకరణ, పెళుసైన మౌలిక సదుపాయాల మధ్య అసమతుల్యత, భయంకరమైన పరిణామం అంటున్నారు నిపుణులు. ఆకాశహర్మ్యాలకు ప్రసిద్ధి చెందిన షాంఘైలో రోడ్లు కుంగిపోవటం ఆందోళన కలిగించింది. ఈ సింక్ హోల్ ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే లక్షలాది మందికి భయంకరమైన హెచ్చరికగా మారింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..