
మొబైల్ ఫోన్ చోరీ చేసి.. పారిపోతూ ఓ దొంగ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్లో ఒకరు కొద్ది దూరం పరుగెత్తగానే రోడ్డుపైనే కుప్పకూలి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ సాయంత్రం బెంగళూరులోని కబ్బన్పేట్ ప్రాంతంలో జునైద్ (18), అర్బాజ్ (23) అనే ఇద్దరు యువకులు స్కూటర్పై వచ్చి ఓ వ్యక్తి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి వేగంగా పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే బాధితుడు వెంటనే అరుస్తూ వారిని వెంబడించాడు.
ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ కార్మికుడు పరిస్థితిని గమనించి తన చేతిలో ఉన్న బస్తాను నిందితుల వైపు విసిరాడు. దీంతో స్కూటర్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. చుట్టుపక్కల ప్రజలు తమవైపు వస్తున్నారని గుర్తించిన ఇద్దరు నిందితులు స్కూటర్, మొబైల్ ఫోన్ను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. దాదాపు 250 మీటర్ల దూరం పరుగెత్తిన తర్వాత జునైద్ ఒక్కసారిగా రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. స్థానికులు, పోలీసులు అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మరో నిందితుడు అర్బాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
దర్యాప్తులో జునైద్కు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు, గతంలో అతడికి గుండె శస్త్రచికిత్స చేసి స్టంట్ కూడా అమర్చినట్లు తల్లిదండ్రులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అధిక శారీరక ఒత్తిడి, పరుగెత్తడం వల్లే అతడు కుప్పకూలి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం వెల్లడవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జునైద్పై ఇంతకుముందు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ఇది అతడి తొలి నేరప్రయత్నమని పోలీసులు గుర్తించారు. అయితే అర్బాజ్పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి