
అల్ప్రాజోలమ్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. గుజరాత్ రాష్ట్రం వలసాడ్ జిల్లాలో గుట్టుగా వ్యాపారం చేస్తున్న ఇందుకు సంబంధించిన ముఠాను ‘అలర్ట్- డీఆర్ఐ(DRI) ఆపరేషన్ వైట్ కాడ్రన్’ పేరిట చేపట్టిన ఆపరేషన్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్టీ స్టేట్ డ్రగ్ నెట్వర్క్ను ధ్వంసం చేస్తూ అల్ప్రాజోలమ్ తయారుచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి దాదాపు రూ.22 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ మత్తు పదార్థాల తయారీపై పెద్దఎత్తున చర్యలు చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) గుజరాత్లోని వలసాడ్ జిల్లాలో అల్ప్రాజోలమ్ అనే మత్తు మందును తయారుచేస్తున్న ఫ్యాక్టరీని గుర్తించి శాశ్వతంగా దానిని మూసివేయించింది. అరెస్టయిన వారిలో ప్రధాన సూత్రధారులు ఫైనాన్సర్, తయారీదారు మరియు డ్రగ్ రిసీవర్ ఉన్నారు.
గుజరాత్ రాష్ట్ర రహదారి(SH-701)కి దూరంగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ నడుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను బట్టి డీఆర్ఐ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పర్యవేక్షణ నిర్వహించారు. ఈ క్రమంలో నవంబర్ 4, 2025న ఫ్యాక్టరీపై దాడులు చేపట్టారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు బయటపడ్డాయి. పైగా ఇది తయారుచేస్తున్న ముఠా కొద్ది కాలంగా ఇదే వ్యాపారంగా మలుచుకుని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో దాదాపు రూ.22 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 9.55 కిలోల సిద్ధమైన అల్ప్రాజోలమ్తో పాటు 104.15 కిలోల సెమీ ఫినిష్డ్ అల్ప్రాజోలమ్, 431 కిలోల ముడి రసాయన పదార్థాలు మరియు రియాక్టర్, సెంట్రిఫ్యూజ్, ఇండస్ట్రియల్ రిఫ్రిజరేషన్ యూనిట్, హీటింగ్ మాంటిల్ మొదలైన పరిశ్రమలో ఉపయోగించే పరికరాలను అధికారులు సీజ్ చేశారు. అరెస్ట్ అయినవారిలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నట్టు అధికారులు గురించారు.