ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు.. ఏసీ టెక్నీషియన్ చెప్పిన మాటలకు నోరెళ్లబెట్టిన ఫ్యామిలీ..

ప్రస్తుత కాంక్రీట్ జంగిల్‌లో, మండుటెండలకు ఎత్తైన భవనాల్లో ఏసీలు చల్లదనానికి మూలంగా మారాయి. వేసవి కాలంలో ఏసీల అవసరం ఎంతగా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే, చల్లటి గాలి కోసం ఏసీలకు సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. కానీ, ఆ ఏసీలను రిపేర్ చేసే టెక్నీషియన్లు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తారో మనం గుర్తుంచుకోవాలి.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..

ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..  ఏసీ టెక్నీషియన్ చెప్పిన మాటలకు నోరెళ్లబెట్టిన ఫ్యామిలీ..
High rise building AC problem

Updated on: May 02, 2026 | 3:28 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఉదంతం, ఏసీ మెకానిక్కులు ఎదుర్కొంటున్న ప్రాణాపాయ స్థితిని వెలుగులోకి తెచ్చింది. ఒక ఎత్తైన భవనంలోని 23వ అంతస్తులో ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌ను సర్వీస్ చేయడానికి ఒక టెక్నీషియన్ నిరాకరించాడు. తన ప్రాణాలను పణంగా పెట్టలేనని అతను చెప్పిన వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. కేవలం కొద్దిపాటి డబ్బు కోసం భద్రతా ప్రమాణాలు పాటించకుండా పని చేయించుకోవాలనుకోవడం సరికాదని ఈ ఘటన గుర్తు చేస్తోంది. కార్మికుల భద్రత, వారి వృత్తి పట్ల గౌరవం ఉండాలని ఈ వీడియో తెలియజేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక ఎత్తైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని 23వ అంతస్తులో ఏసీ రిపేర్ చేయడానికి ఒక టెక్నీషియన్ వెళ్ళాడు. అయితే, ఆ ఏసీ అవుట్‌డోర్ యూనిట్ భవనం వెలుపల చాలా ప్రమాదకరమైన చోట అమర్చబడి ఉంది. అక్కడ నిలబడటానికి సరైన ఆధారం లేదు, కనీసం భద్రతా బెల్టులు (Safety Harness) కట్టుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. అటువంటి ఎత్తు నుండి కిందకు చూస్తేనే వణుకు పుట్టేలా ఉంది. ఆ స్థితిలో పని చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని భావించిన ఆ మెకానిక్, పని చేయడానికి నిరాకరించాడు. నేను ఈ పని చేయలేను, నాకు నా ప్రాణాలు ముఖ్యం అని అతను స్పష్టంగా చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. కేవలం కొన్ని వందల రూపాయల కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోవడం మూర్ఖత్వమే అవుతుందని అతను అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @SaffronChargers అనే ఖాతా X అనే మైక్రోబ్లాగింగ్ సైట్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే, ఆన్‌లైన్‌లో విస్తృత చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు టెక్నీషియన్ నిర్ణయాన్ని సమర్థించారు. పని కంటే ప్రాణమే ముఖ్యం, అతను తీసుకున్న నిర్ణయం చాలా సరైనది అని కామెంట్స్ చేస్తున్నారు.ఫ్లాట్ యజమానులు సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశాలలో అవుట్‌డోర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశారు, వందల రూపాయల కోసం ఒక పేద వ్యక్తి ప్రాణాన్ని పణంగా పెట్టడం సరికాదు. దీనికి ఫ్లాట్ యజమానులకు జరిమానా విధించాలని డిమాండ్‌ చేశారు.

కార్మికుల భద్రతపై చర్చ:

సాధారణంగా నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో ఏసీ అవుట్‌డోర్ యూనిట్లను అమర్చేటప్పుడు, భవిష్యత్తులో సర్వీసింగ్ చేయడానికి వీలుగా ఉండేలా ప్లాన్ చేయరు. గ్రిల్స్ లేదా బాల్కనీలు లేని చోట వీటిని అమర్చడం వల్ల మెకానిక్కులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కస్టమర్లు కూడా తక్కువ ఖర్చుతో పని పూర్తి కావాలని చూస్తారే తప్ప, టెక్నీషియన్ల భద్రతను పట్టించుకోరు. ఈ ఘటన ద్వారా కంపెనీలు తమ సిబ్బందికి నాణ్యమైన సేఫ్టీ గేర్ అందించాలని, అలాగే వినియోగదారులు కూడా కార్మికుల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పని అయినా సరే, భద్రత తర్వాతే ఏదైనా అనే విషయాన్ని ఈ వైరల్ వీడియో మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us