
బిర్యానీ.. ఈ పేరు వినగానే నోరు ఊరడం ఖాయం. బిర్యానీ రుచికి ఫిదా కానీ వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. అయితే మనకు సహజంగా బిర్యానీ అనగానే చికెన్, మటన్, ఫిష్ లేదా వెజ్ బిర్యానీ గుర్తొస్తుంది. మరి తాంటి ముంజలతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది. తాటి ముంజలతో బిర్యానీ ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! అయితే హైదరాబాద్కు చెందిన ఓ రెస్టరంట్ మాత్రం ఈ బిర్యానీని విక్రయిస్తుండగా, జనాలు ఎగబడి మరీ తింటున్నారు.
సమ్మర్లో తాటి ముంజలు పుష్కలంగా కనిపిస్తాయి. వీటిలోని నీటి శాతం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వీటిని తినమని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే ఈ తాటి ముంజలతో బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీనిని నిజం చేసి చూపించారు హైదరాబాద్కు చెందిన ఓ రెస్టరంట్ యాజమాన్యం. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న మర్యాద రామన్న అనే రెస్టరంట్లో ఐస్ యాపిల్ బిర్యానీని అందిస్తున్నారు.
తాజాగా దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ బకెట్ లిస్ట్ అనే ఇన్స్టాగ్రామ్లో హ్యాండీల్లో షేర్ చేయగా వీడియో తెగ వైరల్ అవుతోంది. తాటి ముంజలతో బిర్యానీతో పాటు కర్రీ కూడా ఈ రెస్టరంట్ వాళ్లు చేశారు. ఎంచక్కా బటర్ నాన్లో ఐస్ యాపిల్ కర్రీని లాగించేస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఐస్ యాపిల్స్ ఆరోగ్యానికి మంచివి కానీ వాటిని ఇలా వండితే అందులో ఎలాంటి పోషకాలు లభించవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వెరైటీ వంటకం తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..