Telangana: ఇంట్లోనే పుట్ట.. దైవంగా భావించిన పామే ఆమె ప్రాణం తీసింది

|

Jul 31, 2024 | 9:25 AM

తన ఇంట్లోనే పుట్ట ఏర్పడింది. అందులో ప్రమాదకర నాగుపాము ఉంది. ఆ పామునే దేవతలా భావించింది ఆ వృద్ధురాలు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి రోజు పూజలు చేసింది. ఆ తర్వాత అదే పాము కాటేయడంతో మృతి చెందింది.

Telangana: ఇంట్లోనే పుట్ట.. దైవంగా భావించిన పామే ఆమె ప్రాణం తీసింది
Gangavva
Follow us on

పాముకు పాలు పోసి పెంచినా విషాన్నే చిమ్ముతుంది అని పెద్దోళ్లు సామెతగా వాడుతుంటారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. అది డేంజరస్ కోబ్రా.. ఓ వృద్ధురాలు ఇంట్లో ఆవాసం ఏర్పరుచుకుంది. ఆ పామును దేవతగా భావించి.. నిత్యం.. పూజలు చేస్తూ.. భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటుంది. ఈ తంతు కొన్నేళ్లుగా జరుగుతుంది. అయితే తాజాగా అదే పాము కాటు వేయడంతో.. ఆమె మృత్యువాత పడిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఖానాపూర్‌ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన 65 ఏళ్ల అలుగుల గంగవ్వకు తనయుడు రాజలింగు, కూతురు పద్మ ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేసిన గంగవ్వ జులై1, 2024 రిటైరై ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం గంగవ్వ తన ఇంటి మట్టి నేలను అలుకుతుండగా…  ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము ఆమె చేతిపై పలుమార్లు కాటు వేసింది. దీంతో పరుగున బయటకు వచ్చిన ఆమె.. స్థానికులకు విషయం చెప్పింది. వారు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా… నాటువైద్యం కోసం లింగాపూర్‌కి తీసుకెళ్లారు. అక్కడివారు పరిస్థితి విషమించిందని మందు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఖానాపూర్‌ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ఆమె మృతి చెందింది. కూతురు పద్మ కంప్లైంట్  మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…