Kishan Reddy: ‘రాహుల్ తెలంగాణ పర్యటన అందుకే’ – కిషన్ రెడ్డి విమర్శలు

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీల సమీక్ష కోసం కాకుండా ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ లెక్కల కోసమే ఈ పర్యటన అని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 ఉపహామీల అమలుపై ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Kishan Reddy:  రాహుల్ తెలంగాణ పర్యటన అందుకే - కిషన్ రెడ్డి విమర్శలు
Rahul Gandhi - Kishan Reddy

Updated on: Mar 02, 2026 | 7:50 PM

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. బాధ్యతగల నాయకుడు అయితే ముందుగా తన పార్టీ ఇచ్చిన హామీలను సమీక్షించేవారని, అయితే రాహుల్‌కు జవాబుదారీతనం ప్రాధాన్యం కాదని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 ఉపహామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలకు చెప్పేందుకు పెద్దగా ఏమీ లేకపోవడంతోనే సమీక్షకు బదులుగా ఇతర ప్రయోజనాల కోసం తెలంగాణకు వచ్చారని విమర్శించారు.

రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం హామీల పురోగతిని తెలుసుకోవడానికోసం కాదని, ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ లెక్కలు చూసుకోవడానికేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే రాజ్యసభ స్థానాలను అనుచరులకు, అనుకూల వ్యక్తులకు కేటాయించేందుకే ఈ పర్యటన అని విమర్శించారు. ప్రజలు అమాయకులు కాదని, ఎన్నికల సమయంలో చేసిన ప్రసంగాలు, ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ వారికి గుర్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హామీల అమలుపై ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us